
ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మరణించారు. ‘యా అలీ’ పాటతో ప్రసిద్ధి చెందిన జుబీన్ మరణం సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది.
Key Points
ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ స్కూబా డైవింగ్ ప్రమాదంలో మృతి.
యా అలీ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
సింగపూర్లో నార్త్ ఈస్ట్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు వెళ్ళిన సమయంలో ప్రమాదం.
అస్సాం ప్రభుత్వం ఆయన మరణాన్ని నిర్ధారించింది.
జుబీన్ గార్గ్ అకాల మరణం
సింగర్ జుబీన్ గార్గ్ కన్నుమూశాడు. 2006లో వచ్చిన ‘యా అలీ’ పాటతో బాగా పాపులర్ అయిన అతడు.. శుక్రవారం (సెప్టెంబర్ 19) సింగపూర్లో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించాడు. అతని వయసు 52. 1990లలో అస్సాంలో పాపులర్ అయిన ఈ సింగర్.. 2006లో ‘యా అలీ’ పాటతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
నార్త్ ఈస్ట్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం సింగర్ జుబీన్ గార్గ్ సింగపూర్లో స్కూబా డైవింగ్ చేస్తుండగా సముద్రంలో పడిపోయాడు. ఆయనను రక్షించి ఐసీయూలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. సింగపూర్లో ఈరోజు జరగాల్సిన నార్త్ ఈస్ట్ ఫెస్టివల్లో ఆయన పర్ఫార్మ్ చేయాల్సి ఉంది.
స్కూబా డైవింగ్ ప్రమాదం
శుక్రవారం (సెప్టెంబర్ 19) మధ్యాహ్నం అస్సాం కేబినెట్ మినిస్టర్ అశోక్ సింఘాల్ సోషల్ మీడియాలో సింగర్ జుబీన్ గార్గ్ మరణాన్ని కన్ఫర్మ్ చేశారు. “మన ప్రియమైన జుబీన్ గార్గ్ అకాల మరణం చాలా బాధాకరం. అస్సాం కేవలం ఒక గొంతును మాత్రమే కాదు, ఒక హృదయ స్పందనను కోల్పోయింది. జుబీన్ దా ఒక సింగర్ కంటే ఎక్కువ. ఆయన అస్సాంకు, దేశానికి గర్వ కారణం. ఆయన పాటలు మన సంస్కృతి, మన ఎమోషన్స్, మన స్పిరిట్ని ప్రపంచంలోని ప్రతి మూలకు చేర్చాయి” అని మినిస్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
“ఆయన సంగీతంలో కొన్ని తరాలు ఎంతో ఆనందం, శాంతిని పొందాయి. ఆయన మరణం ఎంతో బాధాకరం. ఆయన లేని లోటు పూడ్చలేనిదే. అస్సాం తన ప్రియమైన బిడ్డను, ఇండియా తన అత్యుత్తమ సాంస్కృతిక చిహ్నాలలో ఒకరిని కోల్పోయింది. ఆయన కుటుంబానికి, ఫ్రెండ్స్కి, లెక్కలేనంత మంది ఫ్యాన్స్కి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయన వారసత్వం ఎప్పటికీ ప్రేరణ ఇస్తూ ఉండాలి. ఓం శాంతి” అని ఆయన ట్వీట్లో ఉంది.
‘యా అలీ’ పాటతో గుర్తింపు
1972లో మేఘాలయాలో పుట్టిన జుబీన్ గార్గ్.. ఒక అస్సామీ సింగర్. అతని అసలు పేరు జుబీన్ బోర్తకూర్. 1990లలో అతడు తన ఇంటిపేరును గార్గ్ అనే గోత్రంతో మార్చుకున్నారు. 2006లో అతడు ‘గ్యాంగ్స్టర్’ సినిమాలోని ‘యా అలీ’ పాట పాడాడు. ఈ చార్ట్బస్టర్ సక్సెస్తో అతడు దేశవ్యాప్తంగా సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత కూడా పలు బాలీవుడ్ హిట్స్ అందించాడు.
జుబీన్ ప్రధానంగా అస్సామీ, బెంగాలీ ఇంకా హిందీ భాషా ఫిల్మ్ మ్యూజిక్ ఇండస్ట్రీలలో పని చేశాడు. కానీ 40కి పైగా భాషలలో పాడటం విశేషం. చాలా సంవత్సరాలుగా అస్సాంలో అత్యధిక పారితోషికం తీసుకునే సింగర్గా జుబీన్ పేరుగాంచాడు.
జుబీన్ గార్గ్ మరణం సంగీత ప్రియులకు తీరని లోటు. ఆయన పాటలు ఎప్పటికీ మన గుండెల్లో నిలిచిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి.


