|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తమిళ రాజకీయాల్లో శశికళ సంచలనం! కొత్త పార్టీతో పెను మార్పులు!

Published: 13-03-2026, 4:35 AM
తమిళ రాజకీయాల్లో శశికళ సంచలనం! కొత్త పార్టీతో పెను మార్పులు!
  • శశికళ కొత్త పార్టీకి ‘ఆలిండియా పురుచ్చి తలైవార్ మక్కల్ మునేత్ర కళగం’ అని పేరు పెట్టారు.
  • పార్టీ గుర్తుగా ‘కొబ్బరి చెట్టు’ను ఎంచుకున్నారు.
  • ఏఐఏడీఎంకే ఓట్లు చీలిపోతే డీఎంకేకు లాభం చేకూరే అవకాశం ఉంది.
  • పళనిస్వామి నాయకత్వానికి శశికళ సవాలు విసురుతున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ శశికళ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘ఆలిండియా పురుచ్చి తలైవార్ మక్కల్ మునేత్ర కళగం’ పేరుతో ఆమె పార్టీని స్థాపించారు. ఇది తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

శశికళ నూతన పార్టీ ప్రకటన

అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు (Tamilnadu) రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎన్నో ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన మాజీ సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ (VK Shahikala) మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇవాళ ఆమె తన నూతన రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. శశికళ తన పార్టీకి ‘ఆలిండియా పురుచ్చి తలైవార్‌ మక్కల్‌ మునేత్ర కళగం’ (AIADMK) అని పేరు పెట్టారు. అలాగే, తన పార్టీ గుర్తుగా ‘కొబ్బరి చెట్టు’ను ఆమె ప్రకటించారు. ఏఐఏడీఎంకే వ్యవస్థాపకులు, దివంగత ఎంజీ రామచంద్రన్ (MGR) స్మారకార్థం ‘పురుచ్చి తలైవార్’ అనే పదాన్ని పార్టీ పేరులో చేర్చడం విశేషం.

జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకేలో తలెత్తిన విభేదాలు, ఆ తర్వాత శశికళ జైలుకు వెళ్లడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ కొత్త పార్టీ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమిళ ప్రజల సంక్షేమం, జయలలిత ఆశయాల సాధనే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జయలలిత, ఎంజీఆర్ విగ్రహాలకు ఆమె ఘన నివాళులర్పించారు.

ఏఐఏడీఎంకేపై పడే ప్రభావం

శశికళ ఏఐఏడీఎంకే పార్టీతో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అనే చర్చ తమిళనాడు పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అత్యధిక నష్టం పళనిస్వామి సారథ్యంలోని ఐడీఎంకేకు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శశికళ ఓటు బ్యాంకు ప్రధానంగా ఏఐఏడీఎంకేకు మద్దతు ఇచ్చే దక్షిణ తమిళనాడులో ఉంటుంది. ఇప్పుడు ఆమె పార్టీ పెట్టడం వల్ల ఏఐఏడీఎంకే ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఈ పరిణామం పళనిస్వామికి ఇది పెద్ద సవాలు. శశికళ తన ప్రసంగాల్లో ఆయన్నే టార్గెట్ చేస్తున్నారు. పార్టీ క్యాడర్‌తో పాటు ఓటర్లలో కొంత భాగం శశికళ వైపు వెళ్తే, పళనిస్వామి నాయకత్వానికి అది దెబ్బ అవుతుంది. ఇక తాజాగా పన్నీర్‌సెల్వం డీఎంకేలో చేరడంతో శశికళ పార్టీ పెట్టడం వల్ల ఆయన వర్గానికి చెందిన నాయకులు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.

రాజకీయ విశ్లేషకుల అంచనాలు

ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే ఓట్లు చీలిపోతే, అది అంతిమంగా అధికార పక్షమైన డీఎంకేకే లాభం చేకూరుస్తుంది. వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోవడం వల్ల డీఎంకే అభ్యర్థులు సులభంగా గెలిచే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకోవాలనుకుంటున్న బీజేపీ వంటి పార్టీలకు ఇదొక సువర్ణావకాశంమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏఐఏడీఎంకే బలహీనపడితే, ఆ ఖాళీని భర్తీ చేసేందుకు ఈ పార్టీలు ప్రయత్నిస్తాయి. ఒకవేళ ఎన్నికల నాటికి శశికళ బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ (NDA) కూటమితో కలిస్తే, అది ఆ కూటమికి మరింత బలాన్ని ఇస్తుంది.

శశికళ కొత్త పార్టీతో తమిళ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి. ఏఐఏడీఎంకే ఓట్లను చీల్చి డీఎంకేకు మేలు చేస్తుందా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.