
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్, క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్కు ధన్యవాదాలు తెలిపింది. ఆస్ట్రేలియాపై గెలిపించినందుకు కాకుండా, తన బలహీనతలు, యాంగ్జైటీ అనుభవాలను నిస్సంకోచంగా పంచుకున్నందుకు దీపికా ఆమెను అభినందించింది. మానసిక ఆరోగ్య సమస్యలపై ధైర్యంగా మాట్లాడిన జెమీమాను దీపికా ప్రత్యేకంగా ప్రశంసించింది.
Key Points
స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ జెమీమా రోడ్రిగ్స్కు ధన్యవాదాలు తెలిపింది.
గెలిపించినందుకు కాకుండా, మానసిక ఆరోగ్య కథను పంచుకున్నందుకు దీపికా ప్రశంసించింది.
జెమీమా టోర్నమెంట్ ప్రారంభంలో యాంగ్జైటీతో బాధపడి, తల్లిదండ్రుల మద్దతు పొందింది.
జట్టు నుంచి తప్పించినప్పుడు మరింత ఒత్తిడికి గురైనట్లు జెమీమా వెల్లడించింది.
దీపికా పదుకోన్ ప్రశంసలు
జెమీమా రోడ్రిగ్స్ కు థ్యాంక్స్ చెప్పింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్. అయితే అది ఆస్ట్రేలియాపై గెలిపించినందుకు కాదు.. ఆ తర్వాత తన బలహీనతలను చెప్పుకుంటూ ఎలాంటి పరిస్థితులు అనుభవించానో చెప్పినందుకు దీపిక థ్యాంక్స్ చెప్పింది.
ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఓవర్నైట్ స్టార్ అయిపోయింది. వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో సెంచరీతో టీమ్ ను గెలిపించిన ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అటు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో జెమీమాను ప్రత్యేకంగా ప్రశంసించింది. ఆందోళనతో తాను ఎదుర్కొన్న కఠిన క్షణాలను, తన భావోద్వేగాలను నిస్సంకోచంగా బయటపెట్టినందుకు ధన్యవాదాలు చెప్పింది.
యాంగ్జైటీ గురించి చెప్పినందుకు..
మానసిక ఆరోగ్య సమస్యలతో తాను పడిన వేదన గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడే దీపికా.. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. “థాంక్యూ జెమీమా రోడ్రిగ్స్.. మీరు మీ బలహీనతను అంగీకరించినందుకు, మీ కథను పంచుకున్నందుకు” అంటూ ఆమె జెమీమాను అభినందించింది.
జెమీమా రోడ్రిగ్స్ మనసులోని మాట
జెమీమా రోడ్రిగ్స్ ఏం చెప్పిందంటే?
“నేను ఇక్కడ చాలా నిజాయతీగా మాట్లాడుతున్నా. ఎందుకంటే నా మాటలు వింటున్న ఎవరైనా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంటే, వారికి ఉపయోగపడాలని నేను అనుకుంటున్నాను. బలహీనతల గురించి మాట్లాడటానికి ఎవరూ ఇష్టపడరు” అని జెమీమా చెప్పింది.
“ఈ టోర్నమెంట్ ప్రారంభంలో నేను చాలా యాంగ్జైటీకి గురయ్యాను. కొన్ని మ్యాచ్లకు ముందు కూడా మా అమ్మకు ఫోన్ చేసి చాలా ఏడ్చేదాన్ని. నా బాధనంతా బయటపెట్టేదాన్ని. ఎందుకంటే ఆందోళనలో ఉన్నప్పుడు మొద్దుబారినట్లు అనిపిస్తుంది. ఏం చేయాలో తెలియదు. మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తాం. ఆ కష్టకాలంలో మా అమ్మానాన్న చాలా మద్దతు ఇచ్చారు” అని వివరించింది.
యాంగ్జైటీ, ఒత్తిడితో పోరాటం
ప్రతిరోజు తాను అరుంధతి రెడ్డి ముందు ఏడ్చేదాన్నని జెమీమా చెప్పింది. ఇక స్మృతి మంధానా కూడా తనకు సాయం చేసిందని, రాధా యాదవ్ కూడా తనను బాగా చూసుకుందని జెమీమా తెలిపింది. జట్టు నుంచి తనను తప్పించినప్పుడు పరిస్థితులు మరింత దిగజారాయని ఆమె పంచుకుంది.
“అది నన్ను నిజంగా బాధించింది. జట్టు నుంచి తప్పించినప్పుడు చాలా సందేహాలు వస్తాయి. నేను ఎప్పుడూ జట్టుకు నా వంతు సహకారం అందించాలని కోరుకుంటాను. కానీ ఆ రోజు బయట కూర్చుని నేను ఏమీ చేయలేకపోయాను. ఆ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చినప్పుడు గత నెలలో జరిగిన వాటన్నిటితో ఒత్తిడి మరింత ఎక్కువైంది” అని చెప్పింది.
మ్యాచ్ విషయానికి వస్తే జెమీమా 134 బంతుల్లో 127 పరుగులతో అజేయంగా నిలిచింది. భారత్ మహిళల వన్డే చరిత్రలోనే అత్యధిక చేజింగ్ను నమోదు చేసింది. 339 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు, తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. భారత్ ఇప్పుడు నవంబర్ 2 నాడు జరిగే ఫైనల్ పోరులో సౌతాఫ్రికాతో తలపడనుంది.
జెమీమా రోడ్రిగ్స్ తన వ్యక్తిగత బలహీనతలను పంచుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యం గురించి బహిరంగ చర్చకు ఆజ్యం పోసింది. ప్రముఖులు ఇలాంటి విషయాలపై మాట్లాడటం సమాజంలో అవగాహన పెంచడానికి, ఇతరులు తమ సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఇది ధైర్యమైన, స్ఫూర్తిదాయకమైన చర్య.


