
📌 Key Points
- రాష్ట్రంలో రాగల 4 రోజులు పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా.
- దక్షిణ తెలంగాణలోని జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
- కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని అంచనా.
- ఏప్రిల్ 19వ తేదీన పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.
భానుడి భగభగలతో తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్న వేళ, వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాగల నాలుగు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.
రాగల నాలుగు రోజులు వర్ష సూచన
Telangana Weather Report : భానుడి భగభగలతో తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 దాటితే చాలు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. చాలా చోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా… జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో… తెలంగాణకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రాగల 4 రోజుల పాటు పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్న వివరాల ప్రకారం…. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని అంచనా.
దక్షిణ తెలంగాణలోని జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇవాళ ఉదయం 8 గంటలలోపు జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
ఏప్రిల్ 17 ఉదయం 8 తర్వాత నుంచి ఏప్రిల్ 19 ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎండల తీవ్రత మళ్లీ పెరిగే ఛాన్స్ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ ఏప్రిల్ 19వ తేదీనే పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.
అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తమ కోతకు వచ్చిన పంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల దగ్గర లేదా కింద ఉండకూడదని హెచ్చరిస్తున్నారు.
ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 43.8 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లాలో 42.7, మహబూబ్నగర్లో 42, రామగుండంలో 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ, రేపు కూడా ఉత్తర, దక్షిణ తెలంగాణలో కొన్నిచోట్ల ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు తమ పంటలను కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


