
📌 Key Points
- యెమెన్లో రాజకీయ హత్యల కోసం యూఏఈ అమెరికా మాజీ సైనికుడిని నియమించిందనే ఆరోపణలు.
- హత్యలకు పాల్పడినందుకు గాను హంతకుడు నెలకు రూ.12 కోట్ల జీతం అందుకున్నాడు.
- 2015లో యెమెన్ ఎంపీ అన్సాఫ్ అలీ మాయోను హత్య చేయడానికి కుట్ర జరిగిందని ఆరోపణ.
- హత్యాయత్నం నుండి తప్పించుకున్న ఎంపీ మాయో ప్రస్తుతం సౌదీ అరేబియాలో ప్రవాస జీవితం గడుపుతున్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కోసం యెమెన్లో రాజకీయ హత్యలు చేస్తూ ఒక అమెరికా సైనికుడు నెలకు మిలియన్ డాలర్లు సంపాదించాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
యూఏఈ కోసం యెమెన్లో హత్యలు చేసిన అమెరికా సైనికుడు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కోసం యెమెన్లో రాజకీయ హత్యలు చేస్తూ ఓ అమెరికా సైనికుడు నెలకు మిలియన్ డాలర్లు సంపాదించాడనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదిక ప్రకారం యెమెన్కు చెందిన ఎంపీ అన్సాఫ్ అలీ మాయోను 2015లో హత్య చేసేందుకు అబ్రహం గోలన్ అనే అమెరికా మాజీ సైనికుడిని యూఏఈ అద్దెకు తీసుకుంది. తనకు అప్పగించిన టాస్క్ ను పూర్తి చేసేందుకు అబ్రహం గోలన్ సాన్ డియాగోలో ‘స్పియర్ ఆపరేషన్స్ గ్రూప్’ అనే ప్రైవేట్ మిలిటరీ సంస్థను స్థాపించి ఇందులో అమెరికాకు చెందిన మాజీ నేవీ సీల్స్, స్పెషల్ ఫోర్స్ కమెండోలను చేర్చుకున్నట్లు ఈ కథనం పేర్కొంది. తమను రాజకీయంగా వ్యతిరేకించే వారిని నిర్మూలించడానికి యూఏఈ చేపట్టిన ప్రయత్నంలో భాగంగా ఇదంతా నిర్వహించినట్లు ఈ కథనం పేర్కొంది. ఈ హత్యలకు ఈ ముఠా ఏకంగా 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 12.5 కోట్లు) సంపాదించినట్లు ఈ నివేదిక వెల్లడించింది. హత్యలు జరిగాక భారీగా బోనస్ సైతం అందుకున్నట్లు పేర్కొంది.
హత్యకు గురైన యెమెన్ ఎంపీ అన్సాఫ్ అలీ మాయో
యెమెన్ చట్టసభ సభ్యుడైన అన్సాఫ్ అలీ మాయో ఆరోపణల ప్రకారంతనను చంపడానికి అబ్రహం గోలన్ను కిరాయి హంతకుడిగా యూఏఈ నియమించింది. 2015 డిసెంబర్ 29న ఏడెన్ నగరంలోని ఎంపీ మాయో కార్యాలయంలో గోలన్ ముఠా బాంబులు అమర్చింది. అయితే పేలుడు సంభవించడానికి కొన్ని నిమిషాల ముందే అన్సాఫ్ అలీ అక్కడి నుండి వెళ్లిపోవడంతో ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో ఆయన బయటపడ్డారు. ఆ తర్వాత ప్రాణభయంతో ఆయన సౌదీ అరేబియాకు పారిపోయి ప్రవాస జీవితం గడుపుతున్నారు.
కిరాయి హంతకుడి నేరాన్ని అంగీకరించిన వైనం
మాయో అమెరికా నివాసి కాకపోయినప్పటికీ ‘ఏలియన్ టోర్ట్ స్టాట్యూట్’ అనే చట్టం ప్రకారం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన జరిగినప్పుడు విదేశీయులు కూడా అమెరికా కోర్టులలో దావా వేయవచ్చు. ఈ చట్టం కింద మాయో ఇప్పుడు అబ్రహం గోలన్, ఇస్సాక్ గిల్మోర్, డేల్ కామ్స్టాక్లపై కేసు నమోదు చేశారు. ఆశ్చర్యకర రీతిలో నిందితులు తమ నేరాన్ని మీడియా ముందు బహిరంగంగానే అంగీకరించారు. యెమెన్లో టార్గెటెడ్ అస్సాసినేషన్ (లక్షిత హత్యలు) జరిగిందని దానిని నేనే నడిపానని గోలన్ అంగీకరించారు. ఇదంతా యూఏఈ ఆమోదంతోనే మేము చేశాం” అని గోలన్ 2018లోనే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. యెమెన్ అంతర్యుద్ధంలో తాము ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నట్లు యూఏఈ అంగీకరించినప్పటికీ, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకున్నామన్న ఆరోపణలను మాత్రం తోసిపుచ్చింది. అయితే, అమెరికా మాజీ సైనికులు తమ శిక్షణను ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వాడటంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
యెమెన్ అంతర్యుద్ధంలో ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నట్లు యూఏఈ చెబుతున్నా, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

