
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని శక్తి జిల్లాలోని సింఘీతరై (Singhitarai) గ్రామంలో ఉన్న వేదాంత లిమిటెడ్ పవర్ ప్లాంట్లో ఏప్రిల్ 14, 2026న బాయిలర్ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు మరణించడంతో శనివారం (ఏప్రిల్ 18) నాటికి మృతుల సంఖ్య 24కు చేరినట్లు అధికారులు తెలిపారు. అలాగే మరో 12 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్కారు. ఏప్రిల్ 14 బాయిలర్ నుండి టర్బైన్కు అధిక పీడనంతో ఆవిరిని తీసుకెళ్లే స్టీల్ ట్యూబ్ (High-pressure steam tube) ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బాయిలర్ ఫర్నేస్లో ఇంధనం విపరీతంగా పేరుకుపోయి ఒత్తిడి పెరగడం వల్లే ఈ పేలుడు సంభవించిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. ప్రస్తుతం మరో 12 మంది కార్మికులు రాయ్పూర్, రాయ్గఢ్లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ పెను ప్రమాదంలో మరణించిన వారిలో పశ్చిమ బెంగాల్ (7), ఛత్తీస్గఢ్ (5), జార్ఖండ్ (4), ఉత్తరప్రదేశ్ (3), బీహార్ (2) మధ్యప్రదేశ్ (2) రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో నిర్లక్ష్యం వహించినందుకు గాను వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్తో పాటు ప్లాంట్ మేనేజ్మెంట్కు చెందిన మరో 10 మందిపై శక్తి పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. బీఎన్ఎస్ (BNS) సెక్షన్ 106(1) (నిర్లక్ష్యం వల్ల మరణం సంభవించడం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.


