
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు తమ సొంతూరు తుమ్మన్ పేటలో సందడి చేశారు.
- దేవరకొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు విజయ్ ప్రకటించారు.
- అచ్చంపేట డివిజన్లోని 44 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేయనున్నారు.
- తమ్ముడు ఆనంద్ దేవరకొండ పెళ్లిని సొంతూరిలోనే గ్రాండ్గా చేస్తామని విజయ్ మాటిచ్చారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం అనంతరం సొంతూరు తుమ్మన్ పేటకు వచ్చారు. ఈ సందర్భంగా విజయ్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అచ్చంపేట డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కాలర్షిప్స్ ప్రకటించారు.
సొంతూరిలో విజయ్ దేవరకొండ, రష్మిక సందడి
Vijay Deverakonda: ఇటీవల పెళ్ళి చేసుకున్న సినీ నటులు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్నా (Rashmika Mandanna) దంపతులు నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని సొంతూరు తుమ్మన్ పేట గ్రామంలో సందడి చేశారు. పెళ్లి తర్వాత గ్రామానికి వచ్చిన విజయ్ దేవరకొండ దంపతులకు (Virosh Couple) గ్రామస్తులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించిన అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సొంత ఊరిపై వరాల జల్లు కురిపించారు. ఇకపై రెగ్యులర్గా ఊరికి వస్తానని చెప్పడమే కాకుండా, ఆ డివిజన్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. తన దేవరకొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థలకు స్కాలర్ షిప్ ఇవ్వబోతున్నట్లుగా విజయ్ తన కుటుంబ సభ్యుల సమక్షంలో మాటిచ్చారు.
విద్యార్థులకు స్కాలర్షిప్స్ ప్రకటించిన విజయ్
ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ.. ‘‘సొంత గ్రామంలో ఇల్లు కట్టుకున్న అనంతరం పెళ్లి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఊరితో నాకు ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. మాకు ఇక్కడే ఇల్లు, భూమి ఉన్నాయి. ఇక నుంచి రెగ్యులర్గా గ్రామానికి వస్తాను. పెళ్లి చేసుకున్న శుభ సందర్భంగా విద్యార్థులకు దేవరకొండ చారిటబుల్ ట్రస్ట్ నుంచి స్కాలర్ షిప్స్ ఇవ్వాలని అనుకుంటున్నాము. అచ్చంపేట డివిజన్లోని 44 ప్రభుత్వ పాఠశాలలలోని నైన్త్, టెన్త్ క్లాస్ విద్యార్థుల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఇకపై ప్రతి సంవత్సరం స్కాలర్ షిప్స్ అందజేస్తాం. పెళ్లి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమ్ముడు ఆనంద్ దేవరకొండ పెళ్లిని, ఇదే గ్రామంలో అందరి సమక్షంలో గ్రాండ్గా చేస్తామని మాటిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విజయ్, రష్మికలకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శుభాకాంక్షలు తెలియజేశారు.
తమ్ముడి పెళ్లి కూడా ఇక్కడే: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గ్రాండ్గా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి ఇద్దరికీ చెందిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లిని సన్నిహితుల సమక్షంలో చేసుకున్నా, రిసెప్షన్ను మాత్రం గ్రాండ్గా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 4న హైదరాబాద్లో భారీగా విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ జరగబోతోంది. ఈ వేడుకకు సినిమా ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు హాజరవుతారని తెలుస్తోంది. భారీ బందోబస్తు నడుమ జరగనున్న ఈ వేడుకకు అభిమానులను రావద్దని, కేవలం ఎంట్రీ పాసులు ఉన్నవారు మాత్రమే రావాలని విజయ్, రష్మికలు కోరిన విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ తన సొంతూరిపై ప్రేమను చాటుకున్నారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు సహాయం చేయడం అభినందనీయం. తమ్ముడి పెళ్లిని కూడా ఇక్కడే చేస్తానని చెప్పడం విశేషం.


