|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దళపతికి షాక్: రూ.1.5 కోట్ల ఫైన్ కట్టాల్సిందేనా? హైకోర్టు తీర్పుతో ఉక్కిరిబిక్కిరి!

Published: 06-02-2026, 4:35 AM
విజయ్ దళపతికి షాక్: రూ.1.5 కోట్ల ఫైన్ కట్టాల్సిందేనా? హైకోర్టు తీర్పుతో ఉక్కిరిబిక్కిరి!
  • విజయ్ దళపతికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
  • ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ.1.5 కోట్ల జరిమానాను సవాలు చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేసింది కోర్టు.
  • 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ జరిమానా విధించబడింది.
  • విజయ్ కొత్త రాజకీయ పార్టీ స్థాపనతో ప్రజల్లో మరింత చర్చనీయాంశంగా మారారు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ.1.5 కోట్ల జరిమానాను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

విజయ్‌కు హైకోర్టులో చుక్కెదురు

Vijay Thalapathy:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ.. ఆ చిత్రాలను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తూ.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా మాస్ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్న ఈయన.. తనను ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రజలకు ఏదైనా చేయాలి అనే ఒక ఆకాంక్షతో టీవీకే అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించి, ఈ పార్టీతో అధికారంలోకి రావాలని పలు ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ.. బిజీగా మారిన విషయం తెలిసిందే.

మరొకవైపు ఆయన చివరి సినిమాగా హెచ్. వినోత్ దర్శకత్వంలో ‘జన నాయగన్’ అనే సినిమా చేశారు. ఈ సినిమా ఈ ఏడాది జనవరి 9వ తేదీన సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రావాల్సి ఉండగా.. సెన్సార్ సమస్యల వల్ల ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ముఖ్యంగా అటు నిర్మాతలు ఇటు సెన్సార్ సభ్యుల మధ్య సమస్య.. చిత్రం ఆలస్యానికి మరింత కారణం అవుతోంది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు నోచుకోకుండా అటు చిత్ర నిర్మాతలను హీరోని ఇబ్బంది పెడుతుంటే హీరో విజయ్ దళపతికి ఇప్పుడు మరో సమస్య తలెత్తింది అని చెప్పాలి. తాజాగా మద్రాస్ హైకోర్టులో ఈయనకు చుక్కెదురైంది.

రూ.1.5 కోట్ల జరిమానాకు కారణం ఏమిటి?

వివరాలలోకి వెళ్తే ఆదాయపు పన్ను శాఖ విధించిన పెనాల్టీకి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు విజయ్ దళపతి. అయితే ఆయన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం కొట్టివేసింది. 2015 – 16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విజయ్ రూ.1.5 కోట్లు జరిమానా చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై 2022లో విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. గత నెలలో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఇప్పుడు విచారణ జరిపి విజయ్ వేసిన పిటీషన్ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఇక ఇది చూసిన అభిమానులు విజయ్ మెడకు ఉచ్చు బిగుసుకుంటుంది.. కావాలనే ఆయనను ఇబ్బందుల్లో పడేస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాల్లో విజయ్ బిజీబిజీ

ఇకపోతే ఈ జరిమానా విధించడానికి అసలు కారణం ఏమిటి అంటే.. 2015 – 16 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను శాఖ రిటర్న్ దాఖలు చేసినప్పుడు.. ఆ ఏడాది విజయ్ 35 కోట్ల ఆదాయం పొందినట్లు మద్రాస్ హైకోర్టులో ఆదాయపు పన్ను శాఖ నివేదిక దాఖలు చేసింది. అందుకు సంబంధించి మదింపు చేపట్టిన ఆదాయపు పన్ను శాఖ విజయ్ ఇంట్లో జరిపిన సోదాలలో స్వాధీనం చేసుకున్న పత్రాలను చూడగా.. అక్కడ ఆయన పులి సినిమా కోసం 15 కోట్ల ఆదాయాన్ని తీసుకున్నారు. అయితే ఆ ఆదాయాన్ని ఆ లెక్కల్లో చూపించలేదని తేలింది. దీంతో తనకొచ్చిన ఆదాయాన్ని దాచిపెట్టినందుకు రూ.1.5కోట్లు జరిమానా విధిస్తూ ఆదాయపు పన్ను శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా ఇప్పుడు అక్కడ కూడా ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏది ఏమైనా విజయ్ మూవీకే కాదు ఇప్పుడు ఆయనకి కూడా సమస్యలు తలెత్తాయి. మరి ఈ సమస్యలన్నింటినీ విజయ్ ఎలా అధిగమిస్తారో చూడాలి.

మొత్తానికి విజయ్ దళపతికి ఇది కష్టకాలమనే చెప్పవచ్చు. ఒకవైపు సినిమా విడుదల ఆలస్యం కావడం, మరోవైపు పన్ను వ్యవహారాలు ఆయనకు తలనొప్పిగా మారాయి. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.