
📌 Key Points
- గ్రామ పంచాయతీలు ఇకపై 4 రకాలుగా వర్గీకరణ: రూర్బన్, గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3.
- జనాభా, ఆదాయం ఆధారంగా పంచాయతీల పునర్విభజన చేపట్టిన ప్రభుత్వం.
- కొత్తగా రూర్బన్ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీఓ క్యాడర్ అధికారులు నియామకం కానున్నారు.
- పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులపై దృష్టి సారించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను నాలుగు రకాలుగా పునర్వర్గీకరించింది. జనాభా మరియు ఆదాయం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
నాలుగు రకాలుగా గ్రామ పంచాయతీల వర్గీకరణ
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్ వర్గీకరణకు లైన్ క్లియర్ అయింది. ఈ అంశంపై గత కొంతకాలంగా కసరత్తు కొనసాగుతుండగా…. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలు అందాయి. వీటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఫలితంగా రాష్ట్రంలో నాలుగు రకాల గ్రామ పంచాయతీలు ఉండనున్నాయి.
గ్రామంలోని జనాభా, వచ్చే ఆదాయం ఆధారంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను పునర్ వర్గీకరించారు. ఇప్పటివరకు 3 రకాల గ్రామపంచాయతీలు ఉండగా… ఇకపై నాలుగు రకాలు ఉండున్నాయి. కొత్తగా రూర్బన్ పంచాయతీ ఉండనుంది.
రూర్బన్ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు
ఇప్పటికే పంచాయతీల పునర్విభజన కోసం కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ రాష్ట్రంలోని 13,351 పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించింది. రూర్బన్, గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 పంచాయతీలుగా వర్గీకరించింది. ఇందులో భాగంగా అధిక జనాభా, ఆదాయం కలిగిన పలు గ్రామ పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా గుర్తించింది. వీటికి అధికారులుగా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించి నియమించాలని కమిటీ సూచించింది. కొత్తగా ఉండే రూర్బన్ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీఓ క్యాడర్ అధికారులను నియమించే అవకాశం ఉంది.
గ్రామ పంచాయతీల విభజనకు గతేడాదే రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే…. పంచాయతీ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల్లోనూ పలు విభాగాల ద్వారా విస్తృతమైన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పారిశుధ్యం, తాగునీటి సరఫరా, గ్రామీణ ప్రణాళిక విభాగం, వీధిలైట్లు విభాగం, ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాలపై ఎప్పటికప్పుడు ఫోకస్ పెట్టబోతుంది.
పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులకు ప్రభుత్వం నిర్ణయం
పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చే అంశంపై సంబంధిత శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు సమీక్షించిన ఆయన…. పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించనున్నట్లు కూడా ప్రకటించారు. గతంలో ఉన్న వ్యవస్థలు పంచాయతీల ప్రగతికి అవరోధాలుగా మారాయని కూడా అభిప్రాయపడ్డారు. గతంలో అమలు చేసిన క్లస్టర్ విధానంలోనూ ఇబ్బందులున్నాయని చెప్పుకొచ్చారు. జనాభా, మండల కేంద్రం, గిరిజన, గిరిజనేత ప్రాంతం, ఆదాయం అనే అంశాలను విశ్లేషించుకుని గ్రేడ్లుగా విభజిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు.
పంచాయతీల్లోనూ పట్టణ స్థాయి సౌకర్యాల కల్పనే లక్ష్యంగా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని సర్కార్ భావిస్తోంది. పంచాయతీ కార్యాలయాల్లోనూ పౌర సేవలు సత్వరం అందేలా పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఎంతవరకు దోహదపడుతుందో వేచి చూడాలి. పంచాయతీ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.


