
📌 Key Points
- ఆంధ్రప్రదేశ్లో ఎల్పీజీ కొరత లేదని ప్రభుత్వం స్పష్టీకరణ, ప్రజలు భయపడవద్దని విజ్ఞప్తి.
- విశాఖపట్నం, మంగళూరు నుండి ఎల్పీజీ సరఫరాను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
- బ్లాక్ మార్కెటింగ్, అక్రమ మళ్లింపులను అరికట్టడానికి ప్రత్యేక విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశం.
- ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు ఎల్పీజీ సరఫరాపై ప్రభావం చూపలేదని ప్రభుత్వం పునరుద్ఘాటన.
ఆంధ్రప్రదేశ్లో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రాష్ట్రంలో ఎటువంటి కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి తెలిపారు.
ఏపీలో ఎల్పీజీ కొరతపై ప్రభుత్వ ప్రకటన
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్లపై ఆందోళన నెలకొంది. ఓ వైపు ప్రభుత్వాలు సరిపోయేంత ఎల్పీజీ ఉందని చెబుతున్నాయి. కానీ మరోవైపు చాలా మంది కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీనిద్వారా అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎల్పీజీ పరిస్థితిపై ప్రభుత్వం స్పందించింది.
ఏపీలో ఎల్పీజీ కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రజలు భయపడవద్దని కోరారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్ సరఫరా, స్టాక్ స్థాయిలను సమీక్షించిన తరువాత, ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని మంత్రి చెప్పారు. విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ రిఫైనరీ, మంగళూరు నుండి హసన్ చర్లపల్లి పైప్లైన్, విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసి సౌకర్యాల నుండి ఎల్పీజీ సరఫరాను ట్రాక్ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
ఎల్పీజీ అక్రమ మళ్లింపు, బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించడానికి ప్రత్యేక విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
సరఫరా గొలుసును పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం
ధరల పెరిగాయని, పుకార్లు వ్యాప్తి చేయడంపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాల వారీగా సరఫరా గొలుసును పర్యవేక్షిస్తామని మనోహర్ అన్నారు. రాష్ట్రంలోని ప్రజలు ఎటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కోరని హామీ ఇచ్చారు. కొనసాగుతున్న అంతర్జాతీయ యుద్ధ పరిస్థితి ఇప్పటివరకు ఎల్పీజీ సరఫరాను ప్రభావితం చేయలేదని పునరుద్ఘాటించారు.
ప్రభుత్వం ఎలాంటి సమస్య లేదని చెబుతున్నా.. పలువురు మాత్రం బ్లాక్ మార్కెట్లో దండుకుంటున్నారు. ఏపీలోని అనేక జిల్లాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లను పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హోటళ్లు అధిక ధరలకు సిలిండర్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది. పశ్చిమాసియా యుద్ధ భయాలను చూపిస్తూ పలువురు సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని.. కొంతమంది ఎల్పీజీ పంపిణీదారులు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ అనధికారిక మార్గాల ద్వారా సిలిండర్లను అమ్మేస్తున్నారు. వారం క్రితం వరకు దాదాపు రూ.2,200కి లభించే 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో రూ.3,200 వరకు అమ్ముడవుతోంది.
బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు
స్టాక్ అయిపోయిందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. అయితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా, అధిక ధరలకు సిలిండర్లను ఏర్పాటు చేస్తామని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో గృహ వినియోగం కోసం ఉద్దేశించిన ఎల్పీజీ సిలిండర్ల ను చట్టవిరుద్ధంగా వాణిజ్య సిలిండర్లలో నింపి హోటళ్లకు విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ధరలను పెంచడానికి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో ఇప్పటికే వేలాది సిలిండర్లు బ్లాక్ మార్కెట్లోకి ప్రవేశించాయని సమాచారం.
గృహ ఎల్పీజీ ధరలను కూడా పెంచేసి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. బ్లాక్లో సిలిండర్కు రూ.1500 దాటిపోతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ వార్ గ్యాస్ ధరలపై చూపిస్తుందనే భయం మెుదలైంది. ప్రభుత్వం ఇటీవల ఎల్బీజీ సిలిండర్ల ధరలను పెంచింది. రీఆర్డరింగ్ నిబంధనలను కూడా కఠినం చేసింది. భారతదేశం ఎల్పీజీ డిమాండ్లో ఎక్కువ శాతం దిగుమతుల ద్వారా తీరుస్తుంది. యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్ వంటి గల్ఫ్ దేశాల నుండి ఎల్బీజీ వస్తుంది.
ప్రభుత్వం కొరత లేదని చెబుతున్నప్పటికీ, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయనే ఆందోళనలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమస్యలున్నా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నారు.


