|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పిల్లి గొడవ: పిల్లల బాధ్యత ఎవరిది? పోలీసుల తీర్పుతో ఊహించని ట్విస్ట్!

Published: 14-04-2026, 9:35 AM
పిల్లి గొడవ: పిల్లల బాధ్యత ఎవరిది? పోలీసుల తీర్పుతో ఊహించని ట్విస్ట్!
  • పిల్లి పిల్లల బాధ్యత విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదం బెంగళూరులో చోటు చేసుకుంది.
  • మగ పిల్లి యజమాని పిల్లల పోషణ బాధ్యత తీసుకోవాలని ఆడ పిల్లి యజమానులు డిమాండ్ చేశారు.
  • పోలీసులు రెండు కుటుంబాలకు నచ్చజెప్పి, సమస్యను సామరస్యంగా పరిష్కరించారు.
  • పిల్లి పిల్లలను ఇష్టపడే మూడో వ్యక్తికి దత్తత ఇవ్వాలని పోలీసులు సూచించారు.

బెంగళూరులో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. పిల్లి పిల్లల బాధ్యత ఎవరిదనే విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఈ గొడవ పోలీసుల వరకు వెళ్లడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

పిల్లి పిల్లల బాధ్యత కోసం కుటుంబాల మధ్య వివాదం

మామూలుగా ఆస్తుల కోసం లేదా విడాకుల సమయంలో పిల్లల కస్టడీ కోసం గొడవలు పడటం చూస్తుంటాం.. కానీ బెంగళూరులో పిల్లి పిల్లల బాధ్యత కోసం ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఓ వింత కస్టడీ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని శేషాద్రిపురంలో ఓ వ్యక్తి మగ పిల్లిని పెంచుకుంటున్నాడు. ఆ మగ పిల్లి, పక్కింటి వారి ఆడ పిల్లితో జతకట్టడంతో అది కాస్తా గర్భం దాల్చి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఆగ్రహించిన ఆడ పిల్లి యజమానులు.. ఆ నాలుగు పిల్లి పిల్లలను నేరుగా మగ పిల్లి యజమాని ఇంట్లోకి తీసుకెళ్లారు. ‘మీ పిల్లి వల్లే మా పిల్లి గర్భం దాల్చింది, కాబట్టి తండ్రి హోదాలో ఈ పిల్లల బాధ్యత, వాటికి అయ్యే ఖర్చు (చైల్డ్ సపోర్ట్) మీరే భరించాలి’ అని డిమాండ్ చేశారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ పెద్దది కావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోవడంతో పాటు నవ్వుకున్నారు. ఈ మేరకు ఇరువర్గాలకు నచ్చజెప్పి సమస్యను సామరస్యంగా పరిష్కరించారు. పిల్లి పిల్లలను ఎవరూ బలవంతంగా పెంచుకోవాల్సిన అవసరం లేదని, వాటిని ఎవరైనా ఇష్టపడే మూడో వ్యక్తికి దత్తత ఇవ్వాలని సూచించారు. దీనికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో పిల్లి పిల్లలను కొత్త ఇంటికి తరలించారు. యాసిర్ ముస్తాక్ అనే నెటిజన్ ఈ ఘటన వివరాలను ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పంచుకోవడంతో ఇది వైరల్‌గా మారింది. ఈ వింత ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పుట్టిన వెంటనే తల్లి పిల్లి నుంచి పిల్లలను ఎలా దూరం చేస్తారని, కనీసం నాలుగు వారాలైనా వేచి చూడాల్సిందని కొందరు తప్పుబట్టారు. ఇలాంటివి ఘటనలు జరగకుండా ఉండాలంటే, పెంపుడు జంతువులకు తప్పనిసరిగా స్టెరిలైజేషన్ (కుటుంబ నియంత్రణ) చేసేలా ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురావాలని ఇంకొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

పోలీసుల జోక్యంతో సయోధ్య కుదిరిన వైనం

పిల్లి పిల్లల దత్తతకు పోలీసుల సూచన

చివరకు పోలీసులు రంగంలోకి దిగి ఇరు కుటుంబాలను సముదాయించి, పిల్లి పిల్లలను దత్తత ఇచ్చేలా ఒప్పించారు. దీంతో వివాదానికి సుఖాంతం లభించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.