
అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుండి ఊహించని అడ్డంకులు ఎదురయ్యాయి. ‘జానకి’ అనే పేరుపై అభ్యంతరం తెలుపుతూ సినిమా టైటిల్ మార్చాలని సూచించింది.
Key Points
అనుపమ నటించిన 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ' సినిమాకు సెన్సార్ బోర్డ్ అడ్డంకులు సృష్టిస్తోంది.
'జానకి' అనే పేరు సీతాదేవికి సంబంధించినది కాబట్టి సినిమా టైటిల్ మార్చాలని సూచన.
మలయాళ చిత్ర సంస్థలు సెన్సార్ బోర్డ్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నాయి.
నిర్మాతలు కేరళ హైకోర్టును ఆశ్రయించారు.
‘జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమాకు సెన్సార్ అడ్డంకి
టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేసిన లేటెస్ట్ మలయాళ మూవీ ‘జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ’. ఈ చిత్రంలో మలయాళ నటుడు, కేంద్రమంత్రి సురేశ్ గోపీ కీలక పాత్రలో నటించారు. జూన్ 27న విడుదల కానున్న ఈ సినిమాకు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. సెన్సార్ కోసం బోర్డ్ ముందుకు వెళ్లగా.. సర్టిఫికెట్ ఇచ్చేందుకు నో చెప్పింది. జానకి అనే పేరు సీతాదేవికి మరో పేరు అని.. అలాంటి పాత్రకు ఈ పేరు పెడితే స్క్రీనింగ్ చేయడం కుదరదని సెన్సార్ బోర్డ్ పేర్కొంది. సినిమాలో జానకి అనే పేరుని ఉపయోగించొద్దని సెన్సార్ బోర్డు ఈ చిత్ర నిర్మాతలకు క్లారిటీ ఇచ్చింది. టైటిల్, పాత్ర పేరుని మార్చాలని చిత్రబృందానికి బోర్డ్ సూచించింది. దాడికి గురైన మహిళ పాత్రకు సీతాదేవి పేరు పెట్టలేమని బోర్డు చెప్పింది. జానకి అనే మహిళ.. కోర్టులో చేసే న్యాయపోరాటం అనే స్టోరీతో ‘జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమాని డైరెక్టర్ ప్రవీణ్ నారాయణ్ తీశారు.
సీతాదేవి పేరుపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం
అయితే సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పడంపై మలయాళ చిత్ర సంస్థలు మండపడుతున్నాయి. సెన్సార్ బోర్డ్ వైఖరిని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించాయి. అసోసియేషన్ ఫర్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (AMMA), నిర్మాతల సంఘం, ది ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ తిరువనంతపురంలోని సీబీఎఫ్సీ ప్రాంతీయ కార్యాలయం ముందు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీబీఎఫ్సీ నిర్ణయం ఏకపక్షంగా ఉందని ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు.
మలయాళ చిత్ర పరిశ్రమ నిరసన
అయితే ‘జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమాలో ఎటువంటి మతపరమైన అంశాలు లేవని దర్శకుడు స్పష్టం చేశారు. అయినా కూడా ఈ నిర్ణయం తమను నిరాశకు గురి చేస్తోందని ది ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ జనరల్ సెక్రటరీ ఉన్నికృష్ణన్ కామెంట్స్ చేశారు. అయితే ఈ సినిమాకు తిరువనంతపురంలోని సీబీఎఫ్సీ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ముంబయి ప్రధాన కార్యాలయంలో ఈ మూవీ సెన్సార్కు అడ్డంకులు ఎదురయ్యాయి. దీనిపై నిర్మాతలు ఇప్పటికే కేరళ హైకోర్టు ఆశ్రయించారు.
చివరగా, సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కేరళ హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.


