
📌 Key Points
- కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు.
- తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం రూ.273 కోట్ల నిధులు మంజూరు చేసింది.
- మొదటి దశలో గ్రౌండింగ్ కాని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం కింద 18,213 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేసింది.
కేంద్రం ఆమోదం తెలిపిన గృహ నిర్మాణాలు
పట్టణ ప్రాంతాల్లో సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ తీసుకొచ్చింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో పేదల గృహ నిర్మాణాలకు ఊతం ఇచ్చేలా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ఇళ్ల నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రం సరే అని చెప్పిందని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రతిపాదమకు ఆమోదం తెలుపుతూ.. ఇళ్ల నిర్మాణానికి కేంద్ర వాటా కింద రాష్ట్రానికి మంజూరు కావాల్సిన రూ.273 కోట్ల నిధుల విడుదలకు అనుమతి ఇచ్చింది. పీఎంఏవై అర్బన్ 2.0 పథకంపై ఢిల్లీలో నిర్వహించిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
తెలంగాణ లో ప్రస్తుతం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం ఇంటిని మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఇంటి నిర్మాణానికి దశలవారీగా రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ఇందులో భాగంగా 118 పట్టణ ప్రాంతల్లో రూ.910.65 కోట్ల అంచనా వ్యయంతో 18213 ఇళ్లను నిర్మించాలని తెలంగాణ ప్రతిపాదన చేసింది. ఇందులో కేంద్రం వాటా రూ.273 కోట్లు. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై హౌసింగ్ కార్పొరేషన్ దృష్టిపెట్టింది.
పీఎంఏవై అర్బన్ 2.0 పథకం కింద నిధులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నిధుల మంజూరు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించుకోవాలనుకున్న పేదలకు ఇది శుభవార్త అవుతుంది. కేంద్రం నిధులు సమకూరుస్తుండటంతో ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. త్వరలోనే ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో అమల్లోకి వస్తాయి.
ఏప్రిల్ 1 నుంచి రెండోదశ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమం కానుంది. రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. మొదటి దశలో రాష్ట్రమంతటా గ్రౌండింగ్ కాని (20 శాతం) లబ్ధిదారులతో మాట్లాడాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీల సూచనల మేరకు మార్చి 31 నాటికి లక్ష ఇండ్ల గృహ ప్రవేశాలు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రభుత్వం దృష్టి
‘ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉచిత ఇసుక సరఫరా చేస్తోంది. లబ్ధిదారులకు ఇసుక లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. మహిళా సంఘాల ఆధ్వర్యంలో బ్రిక్ యూనిట్లు, ప్రతి మండలంలో ఒకటి లేదా రెండు యూనిట్లు ఏర్పాటు చేయాలి. నిర్మాణ సామాగ్రి ధరల భారం లబ్ధిదారులపై పడకుండా జిల్లా స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు చురుగ్గా పని చేయాలి.’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాక ఒకటి లేదా రెండు విడతల్లో చెల్లింపులు జరిగిన తరువాత… వివిధ కారణాలతో చెల్లింపులు ఆగిపోతే వెంటనే క్లియర్ చేయాలని మంత్రి ఆదేశించారు. తక్షణమే క్లియర్ చేయకపోతే అధికారులపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. రెండో దశలో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.
కేంద్రం నిధులు మంజూరు చేయడంతో పేదల సొంతింటి కల త్వరలోనే నెరవేరనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం గృహ నిర్మాణాలను వేగవంతం చేయనుంది. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.


