
స్థానిక చెన్నై పోర్టులో మంగళవారం ఉదయం ఓ ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎండ తీవ్రతకు పోర్టు యార్డులో నిల్వ ఉంచిన సల్ఫర్ రసాయన చర్యకు గురై భారీ ఎత్తున పొగలు వెలువడ్డాయి. ఎరువుల తయారీ కోసం ఓ సంస్థ దిగుమతి చేసుకున్న ఈ సల్ఫర్ నుంచి ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పొగలు రావడం ప్రారంభమైంది.
ఈ దట్టమైన పొగలు పోర్టు పరిసరాల్లో దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల మేర కమ్మేయడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలి పీల్చుకోవడం కష్టంగా మారి పలువురు స్పృహ కోల్పోయినట్లు సమాచారం. పొగ తీవ్రతను గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమై సచివాలయం వైపు వెళ్లే రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఎవరూ భయాందోళనలకు గురి కావద్దని అధికారులు స్పష్టం చేశారు.


