
📌 Key Points
- తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దగ్గుబాటి ఫ్యామి హెచ్చరిక.
- కోర్టు విచారణలను తప్పుగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
- క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తామని దగ్గుబాటి కుటుంబం హెచ్చరించింది.
దగ్గుబాటి కుటుంబం తమపై వస్తున్న నిరాధార ఆరోపణలపై సీరియస్ అయింది. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు తొలగించాలని ఆదేశించింది. లేకుంటే పరువు నష్టం దావా వేస్తామని తెలిపింది.
దగ్గుబాటి ఫ్యామిలీ హెచ్చరిక
Daggubati Family: కొంతకాలంగా తమ కుటుంబంపై వస్తున్న నిరాధారమైన ఆరోపణల పట్ల దగ్గుబాటి ఫ్యామిలీ (Daggubati Family) తీవ్రస్థాయిలో ఫైరయింది. తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ దగ్గుబాటి ఫ్యామిలీ హెచ్చరించింది. దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. డెక్కన్ కిచెన్ హోటల్ వివాదం నిమిత్తం ఈ కేసు విచారణ మీద విచారణలను ఎదుర్కొంటూ వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యామిలీపై కొన్ని ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. ఈ ఆరోపణలపై దగ్గుబాటి ఫ్యామిలీ ఫైర్ అవుతూ విడుదల చేసిన ప్రకటనలో..
దుష్ప్రచారం చేస్తే చర్యలు
‘‘మా కుటుంబం ఏదో తప్పు చేసినట్లు దేశంలో ఏ కోర్టు కూడా ఇప్పటివరకు తీర్పు ఇవ్వలేదు. కానీ, సాధారణంగా జరిగే కోర్టు విచారణలను సైతం మేం ఏదో తప్పు చేసినట్టుగా చిత్రీకరిస్తూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం’’ అని వారు స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లో విచారణ దశలో ఉన్న అంశాలను సోషల్ మీడియాలో చర్చించడం, సంచలనం కోసం ఎవరిష్టం వచ్చినట్లుగా వారు కథనాలు అల్లడం తగదని వారు హితవు పలికారు. తమ వ్యక్తిగత లేదా వ్యాపార ప్రయోజనాల కోసం ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే వ్యక్తులు, సంస్థలు ఇకపై తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని దగ్గుబాటి ఫ్యామిలీ హెచ్చరించింది. అవాస్తవాలను (False Information) ప్రచారం చేసే వారు క్రిమినల్, సివిల్ చర్యలకు బాధ్యులవుతారని.. కేవలం క్లిక్కుల కోసం, వ్యూస్ కోసం వాస్తవాలను దాచిపెట్టి అసత్యాలను వండివార్చే వైఖరిని ఇకపై సహించేది లేదని దగ్గుబాటి ఫ్యామిలీ తేల్చి చెప్పింది.
సోషల్ మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్
ముఖ్యంగా సోషల్ మీడియా పేజీలు, యూట్యూబ్ ఛానెళ్లు, న్యూస్ పోర్టల్స్ను ఉద్దేశించి ఈ ప్రకటనలో కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే తమ కుటుంబంపై అవాస్తవ ఆరోపణలతో పోస్ట్లు చేసినా లేదా వీడియోలు షేర్ చేసినా, వాటిని వెంటనే తొలగించాలి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు సదరు సంస్థలు లేదా వ్యక్తులు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. ఒకవేళ ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తే, పరువు నష్టం దావా వేయడంతో పాటు కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దగ్గుబాటి కుటుంబం ఎంతో కాలంగా సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని కలిగి ఉందని, అలాంటి ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించే వారిని వదిలిపెట్టబోమని.. ఇప్పటికైనా అవాస్తవాలను ప్రచారం చేసే వారు తమ పద్ధతి మార్చుకోవాలని, లేదంటే కోర్టు మెట్లు ఎక్కక తప్పదని దగ్గుబాటి ఫ్యామిలీ విడుదల చేసిన ఈ ఘాటైన ప్రకటనతో స్పష్టమవుతోంది.
దగ్గుబాటి ఫ్యామిలీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారికి ఇది ఒక గుణపాఠం కావాలని ఆశిద్దాం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సమాజంలో తప్పుడు ప్రచారం చేయడం సరికాదు.


