
📌 Key Points
- నగరంలో 60 రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలున్నాయని సీపీ సజ్జనార్ వెల్లడి.
- లూజ్ పెట్రోల్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
- తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక.
- ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు.
హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. నగరంలో తగినంత నిల్వలు ఉన్నాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పెట్రోల్ నిల్వలపై సీపీ సజ్జనార్ ప్రకటన
హైదరాబాద్ నగరంలో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.
ఇంధన సరఫరాపై తలెత్తిన అపోహల నేపథ్యంలో బుధవారం టీజీసీసీసీలో జిల్లా కలెక్టర్ హరిచందన, అదనపు సీపీ తప్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ శ్వేత, సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, నగరవ్యాప్తంగా సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు.
లూజ్ పెట్రోల్ అమ్మకాలపై పోలీసుల హెచ్చరిక
ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగి, కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని, దీనిని కొరతగా భావించవద్దని సజ్జనార్ చెప్పారు. తప్పుడు ప్రచారాల వల్ల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 22న 3,024 లీటర్ల ఇంధనం అమ్ముడవగా, 23న ఆ సంఖ్య రెట్టింపై 6,400 లీటర్లకు చేరుకుందన్నారు. జనం భయాందోళన చెందడం వల్లే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని తెలిపారు.
ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై నిఘా ఉంచామని, అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని 240 పెట్రోల్ బంకుల్లో పరిస్థితిని సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన కలెక్టర్ హరిచందన
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. ఆయిల్ సంస్థలు, సివిల్ సప్లై అధికారులతో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలోని 186 బంకుల్లో ఇంధన సరఫరా సజావుగా సాగుతోందని, ప్రజలు అనవసర ఆందోళనతో బంకుల వద్ద రద్దీ పెంచవద్దని కోరారు. నిత్యావసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, క్షేత్రస్థాయిలో యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ప్రస్తుతం నగరంలో ఇంధన కొరత లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా, నిత్యావసర సేవలకు ఆటంకం కలగకుండా సహకరించాలని కోరుతున్నారు.


