
📌 Key Points
- దివ్యాంగుడి నుండి రూ. 95 లక్షలు వసూలు చేసిన ఐఏఎస్ అధికారిణి ఆరాధన దాస్.
- డబ్బులు తిరిగి అడిగితే చంపేస్తానని బాధితుడిని బెదిరించినట్లు ఆరోపణలు.
- కటక్ సీడీఏ ఫేజ్-2 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- విచారణకు సహకరించని ఐఏఎస్ అధికారిణి, ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూపు.
ఒడిశాలో ఒక ఐఏఎస్ అధికారిణి తన ప్రతాపం చూపిస్తూ దివ్యాంగుడిని మోసం చేసింది. స్థలం ఇప్పిస్తానని నమ్మించి రూ. 95 లక్షలు కాజేసి, తిరిగి అడిగితే ప్రాణాలు తీస్తానని బెదిరించింది. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది.
దివ్యాంగుడికి స్థలం పేరుతో ఐఏఎస్ అధికారిణి టోకరా
ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఓ ఐఏఎస్ అధికారిణిని మోసాలకు తెరలేపింది. స్థలం ఇప్పిస్తాననని ఓ దివ్యాంగుడిని నమ్మించి అతడి వద్ద నుంచి నుంచి ఏకంగా రూ.95 లక్షలు వసూలు చేసి నిండా ముంచింది. ఆ పై పని చేసి పెట్టక పోగా తిరిగి తన డబ్బులు తనకు ఇచ్చేయాలని అడిగిన పాపానికి ప్రాణాలు తీస్తానంటూ బెదిరించింది. ఒడిశా (Odisha) రాష్ట్ర హోం శాఖలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆరాధన దాస్పై (Aradhana Das IAS) వస్తున్న తీవ్ర ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
డబ్బులు తిరిగి అడిగితే బెదిరింపులు, అసభ్య పదజాలం
కటక్ జిల్లాకు చెందిన కమల్ కుమార్ భౌసింకా అనే దివ్యాంగుడికి, కటక్ డెవలప్మెంట్ అథారిటీ (CDA) పరిధిలో స్థలం ఇప్పిస్తానని ఆరాధన దాస్ నమ్మించారు. ఆమె మాటలు నమ్మి కమల్ కుమార్ భార్య బీనా భౌసింకా రెండు విడతలుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా దాదాపు రూ. 95 లక్షలు చెల్లించారు. ఇందులో కొంత మొత్తం నగదు రూపంలో కూడా ఇచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత ఆరాధన దాస్ తన అసలు స్వరూపం బయటపెట్టారు. స్థలం కేటాయించకపోగా, బాధితుడు తన డబ్బు తిరిగి ఇవ్వమని కోరితే ఆమె అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడి భార్య ఆరోపించింది.
దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ప్రభుత్వ అనుమతి కోసం నిరీక్షణ
బాధితుల ఫిర్యాదుతో కటక్ సీడీఏ ఫేజ్-2 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో రూ. 95 లక్షల లావాదేవీలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే, దర్యాప్తుకు సదరు ఐఏఎస్ అధికారిణి ఏమాత్రం సహకరించడం లేదని పోలీసులు తెలిపారు. ఆమె గతంలో భూమి, గృహ నిర్మాణ శాఖల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో, ఆ పలుకుబడిని ఉపయోగించి ఈ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో ఈ నేపథ్యంలో ఆరాధన దాస్పై అధికారికంగా చర్యలు తీసుకునేందుకు అనుమతి కోరుతూ పోలీస్ కమిషనరేట్ రాష్ట్ర హోం శాఖకతో పాటు సాధారణ పరిపాలన శాఖకు (GAD) లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా ఉన్నత హోదాలో ఉండి ఒక దివ్యాంగుడిని మోసం చేశారనే ఆరోపణలు రావడంతో ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ ఉన్నత పదవిలో ఉండి దివ్యాంగుడినే మోసం చేయడం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


