
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ విజయం సాధించడంతో, మెగా ఫ్యామిలీ హీరోలు ప్రసాద్ ల్యాబ్లో ప్రత్యేకంగా సినిమాను వీక్షించారు. చిరంజీవి, రామ్ చరణ్, అకీరా, ఆధ్యతో కలిసి పవన్ కళ్యాణ్ సక్సెస్ జోష్ పంచుకున్నారు. చిరంజీవి ‘ఓజీ’ని హాలీవుడ్ స్థాయి గ్యాంగ్స్టర్ చిత్రంగా ప్రశంసించారు.
Key Points
'ఓజీ'ని ప్రసాద్ ల్యాబ్లో మెగా హీరోలు, కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా వీక్షించారు.
పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, అకీరా, ఆధ్య వంటి ప్రముఖులు వీక్షకుల్లో ఉన్నారు.
చాలా కాలం తర్వాత వచ్చిన సక్సెస్ తో పవన్ కళ్యాణ్ పూర్తి జోష్లో కనిపించారు.
'ఓజీ'ని హాలీవుడ్ ప్రమాణాలతో కూడిన గ్యాంగ్స్టర్ చిత్రంగా చిరంజీవి ప్రశంసించారు.
‘ఓజీ’ వీక్షించిన మెగా కుటుంబం
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `ఓజీ` మూవీ ఈ నెల 25న విడుదలైన విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. మంచి ఆదరణ పొందుతోంది. బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తోన్న ఈ సినిమాని మెగా ఫ్యామిలీ హీరోలు ప్రత్యేకంగా వీక్షించారు. ఇందులో హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తోపాటు చిరంజీవి, రామ్ చరణ్, సాయి తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ తనయుడు అకీరా నందన్, కూతురు ఆధ్య వీక్షించిన వారిలో ఉన్నారు. వీరితోపాటు చిత్ర దర్శకుడు సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, కెమెరామెన్ రవి కె చంద్రన్, నిర్మాత దానయ్య, ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్ వంటి వారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ దగ్గరుండి సినిమాని చూపించడం విశేషం.
ప్రసాద్ ల్యాబ్లో సోమవారం సాయంత్రం ఈ మూవీని మెగా హీరోలు ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్లో కనిపించారు. ఆయనలో సక్సెస్ ఆనందం కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత ఆయనకు సక్సెస్ వచ్చింది. దీంతో తన సంతోషానికి అవదుల్లేవని ఈ ఫోటోని చూస్తుంటే అర్థమవుతుంది. పవన్తోపాటు తమన్, చిత్ర దర్శకుడు సుజీత్ కూడా ఆనందంతో సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తన సినిమా సక్సెస్ ల విషయంలో ఇంతటి ఆనందం వ్యక్తం చేయడం చాలా అరుదు. చాలా ఏళ్ల తర్వాత ఆయన తన సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్ విజయానందం
సినిమా చూసిన అనంతరం చిరంజీవి తన ఆనందాన్ని పంచుకున్నారు. `ఓజీ` సినిమాని నా కుటుంబ సభ్యులందరితో కలిసి చూశాను. ప్రతి అంశాన్ని ఆస్వాదించాను. హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా అద్భుతంగా రూపొందించిన అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ చిత్రమిది. సరైన భావోద్వేగాలను చెక్కుచెదరకుండా ఉంచింది. ప్రారంభం నుంచి చివరి వరకు దర్శకుడు ఈ చిత్రాన్ని అసాధారణ రీతిలో రూపొందించాడు. ఈ సందర్భంగా దర్శకుడు సుజీత్కి నా అభినందనలు. కళ్యాణ్ బాబుని తెరపై చూడటం చాలా గర్వం అనిపించింది. అతను తన స్వాగ్తో సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టారు. అభిమానులు ఎదురుచూస్తున్న సరైన విందుని ఇచ్చాడు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతంలో తన హార్ట్, సోల్ని మేళవించి మ్యూజక్ అందించారు. రవి కె చంద్రన్ విజువల్స్ అద్భుతంగా అందించాడు. ఎడిటింగ్, ఆర్ట్స్ వర్క్ అదిరిపోయాయి. టీమ్లో ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేసి సినిమాని ఉత్తమంగా అందించారు. నిర్మాత దానయ్యకి, చిత్రబృందానికి అభినందనలు` అని పేర్కొన్నారు చిరంజీవి. స్క్రీనింగ్ సందర్భంగా దిగిన ఫోటోలను పంచుకున్నారు.
చిరంజీవి ప్రశంసలు: ఓజీ అద్భుతం
ఈ సందర్భంగా మరో విషయాన్ని స్పష్టం చేశారు చిరంజీవి. మెగాస్టార్ తన ట్వీట్లో మా కుటుంబ సభ్యులతో కలిసి సినిమాని చూసినట్టు పేర్కొన్నారు. అంటే మెగా ఫ్యామిలీ వీరే అనే విషయాన్ని స్పష్టంచేశారు. ఇందులో అల్లు హీరోలు లేకపోవడంతో ఇదే తమ ఫ్యామిలీ అనేది చిరు స్పష్టం చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ నెల 25న విడుదలైన `ఓజీ` మూవీ ఐదు రోజుల్లో దాదాపు రూ. 263కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఐదో రోజు ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.11కోట్లు వచ్చాయి. ఆదివారంతో పోల్చితే భారీగా తగ్గాయి. అయితే ఇదే కలెక్షన్లు ఈ వారం వరకు కంటిన్యూ అయితే సినిమా సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. ఈ మూవీకి థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.175కోట్లు. ఇప్పటి వరకు సుమారు రూ.150కోట్ల షేర్ వచ్చినట్టు టాక్. అంటే ఇంకా రూ.25-30కోట్లు షేర్ రావాలి. అంటే దాదాపు యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావాల్సి ఉంది.
మొత్తంగా, ‘ఓజీ’ సినిమా బ్లాక్బస్టర్ దిశగా దూసుకుపోతున్న వేళ, మెగా ఫ్యామిలీ సపోర్ట్, చిరంజీవి ప్రశంసలు సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. పవన్ కళ్యాణ్ సంతోషం, మెగా హీరోల ఐక్యత అభిమానులకు పండగ వాతావరణాన్ని సృష్టించాయి.


