
📌 Key Points
- హైదరాబాద్ మెట్రోకు 60 కొత్త కోచ్ల రాక కనీసం రెండేళ్లు ఆలస్యం కానుంది.
- తెలంగాణ ప్రభుత్వ ఫేజ్-1 ప్రాజెక్ట్ బదిలీ, కేంద్రం ఆదేశించిన ఫ్రెష్ వాల్యుయేషన్ ఆలస్యానికి ప్రధాన కారణాలు.
- ఎస్బీఐ క్యాప్స్కు ప్రాజెక్ట్ వాల్యుయేషన్, ఆర్థిక పునర్నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
- రద్దీ నియంత్రణకు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు, కేంద్రం సమీక్షకు ఆదేశించింది.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు నిరీక్షణ తప్పడం లేదు. కొత్తగా రావాల్సిన 60 కోచ్ల రాక కనీసం రెండేళ్లు ఆలస్యం కానుంది. కేంద్రం ఆదేశించిన ప్రాజెక్ట్ వాల్యుయేషన్, ప్రభుత్వ బదిలీ ప్రక్రియలో జాప్యం దీనికి ప్రధాన కారణం. ఈ ఆలస్యం రద్దీని మరింత పెంచనుంది.
మెట్రో కోచ్ల ఆలస్యానికి కారణమేంటి?
భాగ్యనగరంలో మెట్రో రైళ్లలో రద్దీ సమయాల్లో (పీక్ అవర్స్లో) ప్రయాణించే వారికి మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు. తెలంగాణ ప్రభుత్వ ఫేజ్-1 ప్రాజెక్ట్ బదిలీ ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుండటంతో మెట్రోకు రావాల్సిన 60 కొత్త కోచ్ల చేరిక కనీసం మరో రెండేళ్ల పాటు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా ప్రాజెక్ట్ బదిలీ అయిన వెంటనే.. బెంగళూరు కు చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ సంస్థతో చర్చలు జరిపి అదనపు కోచ్లను ఆర్డర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ మెట్రో ప్రాజెక్ట్కు సంబంధించి సరికొత్త విలువ కట్టాలని (ఫ్రెష్ వాల్యుయేషన్) ఆదేశించడంతో ప్రక్రియ నిలిచిపోయింది. దీనివల్ల కోచ్ల కొనుగోలుతో పాటు ఇతర కీలక నిర్ణయాలు కూడా వాయిదా పడ్డాయి.
ఈ ప్రాజెక్ట్ వాల్యుయేషన్ బాధ్యతలను, ఆర్థిక పునర్నిర్మాణ పర్యవేక్షణను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ క్యాప్స్కు అప్పగించారు. అలాగే మెట్రోకు ఉన్న పాత అప్పులను తిరిగి చెల్లించేందుకు (రీఫైనాన్స్) తగిన రుణదాతను గుర్తించాలని కూడా ఈ సంస్థను కోరారు. ఈ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని, ఈ బదిలీ ప్రక్రియ అంతా ముగిసేసరికి 2026 చివరి నాటికి చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రయాణికుల రద్దీ.. సీఎం రేవంత్ రెడ్డి లేఖ
బదిలీ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త కోచ్ల కోసం ఆర్డర్ ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఆర్డర్ ఇచ్చినప్పటికీ, తయారీ, డెలివరీకి కనీసం 15 నెలల సమయం పడుతుందని బెంగళూరుకు చెందిన సంస్థ స్పష్టం చేసింది. దీనివల్ల కొత్త కోచ్లు మెట్రో సర్వీసుల్లో చేరడానికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుంది.
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ మార్గంలో పీక్ అవర్స్లో కోచ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ రద్దీని నియంత్రించాలంటే కోచ్ల సంఖ్యను పెంచడం అత్యవసరం అని అధికారులు చెబుతున్నారు.
కేంద్రం జోక్యం.. సమీక్షకు ఆదేశం
ఈ సమస్య తీవ్రతను గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.., ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. అనంతరం కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్లతో కూడా సమావేశాలు జరిగాయి. దీనిపై స్పందించిన కేంద్రం, ఫేజ్-1 వాల్యుయేషన్తో పాటు ఫేజ్-2 విస్తరణపై సమగ్ర సమీక్షను ప్రారంభించింది.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
మెట్రో కోచ్ల ఆలస్యం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం వేగవంతమైతేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. లేదంటే భాగ్యనగర మెట్రో ప్రయాణికులకు నిరీక్షణ తప్పదు.


