
ప్రముఖ పాకిస్థానీ నటి హుమైరా అస్ఘర్ అలీ మృతి వార్త ఆ దేశంలో సంచలనం సృష్టించింది. ఆమె మృతదేహం తొమ్మిది నెలల తర్వాత కుళ్లిపోయిన స్థితిలో బయటపడింది. 2024 అక్టోబర్లో ఆమె మరణించి ఉండొచ్చని అనుమానం.
Key Points
పాకిస్థానీ నటి హుమైరా అస్ఘర్ అలీ మృతదేహం 9 నెలల తర్వాత కనుగొనబడింది.
ఆమె మృతదేహం కుళ్లిపోయిన దశలో ఉంది.
ఆమె 2024 అక్టోబర్లో మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
రెంట్ కట్టకపోవడం వల్ల ఆమె ఇంటికి విద్యుత్తు సరఫరా నిలిపివేయబడింది.
నటి మృతి వార్త సంచలనం
ప్రముఖ పాకిస్థానీ నటి హుమైరా అస్ఘర్ అలీ మరణవార్త ఆ దేశంలో సంచలనం సృష్టిస్తోంది! అస్ఘర్ అలీ మృతదేహం ఇటీవలే బయటపడగా.. ఆమె గతేడాది అక్టోబర్లో మరణించిన ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లాహోర్కు చెందిన హుమైరా అస్ఘర్ అలీ 2015లో వినోద పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె “జస్ట్ మ్యారీడ్,” “ఎహసాన్ ఫరామోష్,” “గురు,” “చల్ దిల్ మేరే” వంటి పలు టెలివిజన్ షోలలో సహాయక పాత్రలు పోషించారు. ఇక సినిమాల విషయానికొస్తే, ఆమె “జలైబీ (2015)”, “లవ్ వ్యాక్సిన్ (2021)” వంటి చిత్రాలలో నటించింది.
2022లో ఏఆర్వై డిజిటల్లో ప్రసారమైన రియాలిటీ షో “తమాషా ఘర్” లో చేరడంతో ఆమెకు మరింత గుర్తింపు లభించింది. 2023లో జరిగిన నేషనల్ ఉమెన్ లీడర్షిప్ అవార్డ్స్లో ఉత్తమ వర్ధమాన ప్రతిభ- రైజింగ్ స్టార్ అవార్డును కూడా అందుకున్నారు.
పాకిస్థానీ నటి హుమైరా అస్ఘర్ అలీ.. కరాచీలోని ఓ అద్దె ఇంట్లో నివాసముండేవారు. కాగా ఆమె 2024 నుంచి రెంటు కట్టడం లేదని, ఆమె ఖాళీ చేయించాలని సదరు యజమాని కోర్టుకు వెళ్లారు. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఈ నేపథ్యంలోనే హుమైరా అస్ఘర్ అలీ అపార్ట్మెంట్ ని గత మంగళవారం పోలీసులు ఓపెన్ చేశారు. కుళ్లిపోయిన దశలో ఉన్న ఆమె మృతదేహాన్ని చూసి అందరు షాక్ అయ్యారు.
9 నెలల తర్వాత మృతదేహం బయటపడటం
అయితే, ఆమె 2024 అక్టోబర్లో మరణించి ఉండవచ్చని అరబ్ న్యూస్ నివేదిక తాజాగా వెల్లడించింది.
పోస్ట్మార్టం నిర్వహించిన కరాచీ పోలీస్ సర్జన్ డాక్టర్ సుమైయా సయ్యద్ మాట్లాడుతూ.. మృతదేహం “తీవ్రమైన కుళ్లిన స్థితిలో” ఉందని నిర్ధారించారు. ఆమె సుమారు తొమ్మిది నెలల క్రితమే మరణించి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సయ్యద్ అసద్ రజా మీడియాతో మాట్లాడుతూ.. “కాల్ డిటైల్ రికార్డ్ ప్రకారం ఆమె చివరి కాల్ 2024 అక్టోబర్లో జరిగింది,” అని తెలిపారు. ఆమె పొరుగువారు చివరిసారిగా ఆమెను 2024 సెప్టెంబర్ లేదా అక్టోబర్లో చూసినట్లు నివేదిక పేర్కొంది.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బిల్లులు చెల్లించకపోవడం వల్ల 2024 అక్టోబర్లో పాకిస్థానీ నటి హుమైరా అస్ఘర్ అలీ అపార్ట్మెంట్కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అపార్ట్మెంట్లో ప్రత్యామ్నాయ విద్యుత్ వనరు కూడా లేదు!
“హుమైరా మృతదేహం సుమారు తొమ్మిది నెలల నాటిది. ఆమె చివరి యుటిలిటీ బిల్లులు చెల్లించిన తర్వాత, 2024 అక్టోబర్లో విద్యుత్ సరఫరా నిలిపివేసిన సమయంలో ఆమె మరణించి ఉండవచ్చు. ఇంట్లో ఎలాంటి కొవ్వొత్తులు కూడా లేవు,” అని అధికారులు చెప్పారు.
కుళ్లిపోయిన దశలో మృతదేహం
మరొక అధికారి మాట్లాడుతూ.. హుమైరా అస్ఘర్ అలీ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాల ఎక్స్పైరీ డేట్ ఎప్పుడే అయిపోయిందని తెలిపారు. “జాడీలు తుప్పు పట్టి ఉన్నాయి. ఆహారం ఆరు నెలల క్రితమే గడువు తీరిపోయింది,” అని తెలిపారు.
ఆమె ఫ్లోర్లోని ఏకైక ఇతర అపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నందున పొరుగువారికి ఎలాంటి దుర్వాసన రాలేదని అధికారి తెలిపారు. ఫిబ్రవరిలో కొందరు నివాసితులు తిరిగి వచ్చినప్పుడు, వాసన అప్పటికే తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఆమె బాల్కనీ తలుపులలో ఒకటి తెరిచి ఉందని, ఇంటిలోని నీటి పైపులు ఎండిపోయి, తుప్పు పట్టి ఉన్నాయని ద్వారా తెలిసింది.
కాగా హుమైరా కుటుంబం ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించిందని పోలీసులు చెప్పారు. అయితే, ఆమె సోదరుడు నవీద్ అస్ఘర్ ప్రస్తుతం కరాచీకి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం తీవ్రంగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నందున, దానిని చూసి గుర్తించడం సాధ్యం కానందున ధృవీకరణ కోసం డీఎన్ఏ పరీక్ష నిర్వహించారు. “మేము ఇక్కడికి వచ్చాము. అన్ని చట్టపరమైన అవసరాలను పూర్తి చేసిన తర్వాత, మృతదేహాన్ని స్వీకరించాము,” అని నవీద్ అన్నారు.
హుమైరా ఏడు సంవత్సరాల క్రితం లాహోర్ నుంచి కరాచీకి మకాం మార్చిందని, కుటుంబంతో దూరం పెరిగిందని, అప్పుడప్పుడు మాత్రమే వారిని సందర్శించేదని నవీద్ తెలిపారు. ఇటీవలి కాలంలో ఆమె దాదాపు ఒకటిన్నర సంవత్సరంగా ఇంటికి రాలేదని తెలిపారు.
“అందుకే నా తండ్రి, ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే, మీరు ఆమెను అక్కడే ఖననం చేయవచ్చు అని చెప్పారు” అని కుటుంబం ముందుగా నిరాకరించడానికి కారణాన్ని వివరించారు.
హుమైరా అస్ఘర్ అలీ మృతి షాకింగ్గా ఉంది. 9 నెలల పాటు ఆమె మృతదేహం ఇంట్లోనే ఉండటం దారుణం. ఈ ఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.


