
📌 Key Points
- కదులుతున్న రైలు నుంచి చెత్త విసిరేసిన రైల్వే సిబ్బంది వీడియో వైరల్.
- వైరల్ వీడియోపై స్పందించిన రైల్వే శాఖ, సిబ్బందిని తొలగింపు.
- నెటిజన్ల ఆగ్రహం, రైల్వే శాఖపై విమర్శలు.
- సిబ్బందికి కౌన్సెలింగ్ ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటన.
రైల్వే ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే విధంగా, ఓ రైల్వే సిబ్బంది కదులుతున్న రైలు నుండి చెత్తను బయటకు విసిరేసిన ఘటన వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. రైల్వే శాఖ వెంటనే చర్యలు చేపట్టింది.
కదులుతున్న రైలు నుండి చెత్త విసిరిన సిబ్బంది
దేశవ్యాప్తంగా రైళ్లలో కొందరు ప్రయాణికులు నిర్లక్ష్యంగా చెత్త పడేయడం తరచుగా చూస్తూనే ఉంటాం.. అయితే, అలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన రైల్వే పారిశుధ్య సిబ్బందే బాధ్యతారహితంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కదులుతున్న రైలు నుంచి చెత్తను బయటకు విసిరేసిన ఓ పారిశుధ్య కార్మికుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో, రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. సదరు సిబ్బందిని తక్షణమే విధుల నుంచి తొలగించింది.
సోషల్ మీడియాలో వైరల్ వీడియో, నెటిజన్ల ఆగ్రహం
సీల్దా-అజ్మేర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12987) రైలులో ఒక కాంట్రాక్ట్ హౌస్కీపింగ్ సిబ్బంది, డస్ట్బిన్లోని చెత్తను ఒక కవర్లో మూటగట్టి, కదులుతున్న రైలు నుంచి ట్రాక్పైకి విసిరేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను దివ్య గండోత్రా టాండన్ అనే నెటిజన్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో షేర్ చేశారు. ‘భారత్లో పారిశుధ్యం ఎందుకు లోపించిందంటే ఇక్కడ వ్యవస్థలు లేక కాదు, జవాబుదారీతనం లేకపోవడమే. ఇది అజ్ఞానం కాదు, అహంకారం’ అని నెటిజన్ ఘాటుగా విమర్శించారు. కేవలం హెచ్చరికలు, బదిలీలతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను ఆమె ట్యాగ్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం తీవ్రంగా మండిపడుతూ, రైల్వే సిబ్బందికి క్రమశిక్షణ ఎప్పుడు నేర్పుతారంటూ ప్రశ్నించారు.
స్పందించిన రైల్వే శాఖ, సిబ్బంది తొలగింపు
సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలపై నార్త్ వెస్ట్రన్ రైల్వే తక్షణమే స్పందించింది. వీడియోలో ఉన్న కాంట్రాక్ట్ సిబ్బంది సంజయ్ సింగ్ను విధుల నుంచి తొలగించినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించింది. అలాగే సదరు కాంట్రాక్టర్కు జరిమానా విధించినట్లు స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆన్-బోర్డ్ హౌస్కీపింగ్ (OBHS) సిబ్బందికి కౌన్సెలింగ్ ఏర్పాటు చేశామని, చెత్తను నిర్ణీత స్టేషన్లలోనే పారబోయాలని కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు రైల్వే అధికారులు వివరించారు. కాగా, ఈ వీడియో 5 నెలల క్రితం వీడియో అని నెటిజన్లు స్పష్టం చేశారు.
రైల్వే సిబ్బంది నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


