
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఆ రాష్ట్ర ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ ‘ఝల్ మురి’ (Jhalmuri) రుచి చూశారు. వరుస ర్యాలీల మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకున్న ఆయన రోడ్డు పక్కన ఉన్న బండి వద్ద ఆగి ఈ స్నాక్ ఆరగించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి.
ఆదివారం ఝార్గ్రామ్లో జరిగిన బహిరంగ సభ అనంతరం హెలిప్యాడ్కు వెళ్తుండగా ప్రధాని మోడీ కాసేపు ‘కాలేజ్ మోర్’ ప్రాంతంలో ఆగారు. గిరిజన ప్రాబల్యం ఉన్న ఈ జంగల్మహల్ ప్రాంతంలో మోడీ రాకతో స్థానికులు, మహిళలు, పిల్లలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారితో ముచ్చటిస్తూ మోడీ ‘ఝల్ మురి’ ఆరగించారు. తన దగ్గర ఉన్న స్నాక్ను పక్కనే ఉన్న చిన్నారులకు కూడా ఇచ్చి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన తెలుపు రంగు కుర్తా, నీలి రంగు జాకెట్, మెడలో బీజేపీ గుర్తు ఉన్న ఎరుపు రంగు కండువా ధరించి కనిపించారు. చుట్టూ ఉన్న జనం ‘జై శ్రీరామ్’, ‘నరేంద్ర మోడీ జిందాబాద్’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ఈ ఆసక్తికర దృశ్యాలను ప్రధాని మోడీ తన ‘ఎక్స్’ (X) ఖాతాలో పంచుకున్నారు. ‘పశ్చిమ బెంగాల్లో వరుసగా నాలుగు సభలతో ఎంతో బిజీగా ఉన్న ఆదివారం నాడు.. మధ్యలో ఝార్గ్రామ్లో రుచికరమైన ఝల్ మురి తిన్నాను’ అంటూ ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా, ఇలా స్థానిక రుచులను ఆస్వాదిస్తూ ప్రజలతో మమేకం కావడం మోడీకి కొత్తేమీ కాదు. గతంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, అస్సాం ఎన్నికల సమయంలోనూ ఆయన ఆయా రాష్ట్రాల ప్రత్యేక వంటకాలను రుచి చూశారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారాల్లో రోడ్డు పక్కన టీ స్టాల్స్ వద్ద ఆగి తన ‘చాయ్వాలా’ మూలాలను ఆయన తరచుగా ప్రజలకు గుర్తుచేస్తుంటారు.
A post shared by Narendra Modi (@narendramodi)


