
📌 Key Points
- షనయా కపూర్ మొదటి సినిమా ‘ఆంఖోన్ కీ గుస్తాఖియాన్’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం!
- ఓటీటీలో కూడా ఆకట్టుకోలేకపోయిన షనయా తొలి చిత్రం, భారీగా నిరాశపరిచింది.
- విక్రాంత్ మాస్సేతో కలిసి నటించినప్పటికీ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.
- ఫిబ్రవరి 13న విడుదల కానున్న ‘తూ యా మై’ చిత్రంపైనే షనయా ఆశలన్నీ!
బాలీవుడ్ యంగ్ బ్యూటీ, సంజయ్ కపూర్ కుమార్తె షనయా కపూర్ మొదటి సినిమా ఫెయిల్యూర్ గురించి సంచలన విషయాలు వెల్లడించింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా, తన ప్రయత్నాలు ఆపేది లేదని చెబుతోంది. ఆమె మాటల్లోనే అసలు విషయం తెలుసుకుందాం!
తొలి సినిమా ఫెయిల్యూర్ పై షనయా కామెంట్స్
బాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో సంజయ్ కపూర్ గారాల పట్టి షనాయా కపూర్ తన మొదటి సినిమా ‘ఆంఖోన్ కీ గుస్తాఖియాన్’ పరాజయంపై మనసు విప్పారు. బాక్సాఫీస్, ఓటీటీ వద్ద సినిమా నిరాశపరిచినప్పటికీ, కొత్త అవకాశాలతో దూసుకుపోతున్నానని, ఆ ఫెయిల్యూర్ తనను కృంగదీయలేదని షనయా కపూర్ స్పష్టం చేశారు.
బాలీవుడ్ స్టార్ కిడ్స్లో ఒకరైన షనాయా కపూర్, విక్రాంత్ మాస్సే సరసన ‘ఆంఖోన్ కీ గుస్తాఖియాన్’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
ఓటీటీలో కూడా నిరాశపరిచిన ‘ఆంఖోన్ కీ గుస్తాఖియాన్’
అలాగే, గతేడాది సెప్టెంబర్ 5 నుంచి జీ5 లో ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. ఇలా బాక్సాఫీస్, ఓటీటీల్లో తన మొదటి సినిమా ఫెయిల్యూర్ కావడంపై షనాయా కపూర్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమా చూసిన కొద్దిమంది ప్రేక్షకులు తన నటనను మెచ్చుకోవడం తనకు ఎంతో మోటివేషన్ను ఇచ్చిందని షనయా కపూర్ పేర్కొన్నారు. “జీవితంలో ఎప్పుడూ ఆశను వదులుకోకూడదు. నేను మరిన్ని ప్రయోగాలు చేయాలనుకుంటున్నాను, రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను” అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నారు బ్యూటిపుల్ షనయా .
‘తూ యా మై’ సినిమాతో షనయా గ్రాండ్ రీఎంట్రీ
ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్ రాసిన ‘ది ఐస్ హావ్ ఇట్’ కథ ఆధారంగా సంతోష్ సింగ్ ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ సినిమాను తెరకెక్కించారు. రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే వంటి ప్రతిభావంతుడైన నటుడు ఉన్నప్పటికీ కథనం నెమ్మదిగా సాగడంతో ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు.
ఇక షనాయా తన తదుపరి చిత్రం ‘తూ యా మై’ పైనే ఇప్పుడు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. బిజోయ్ నంబియార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించారు. యూత్ఫుల్ లవ్ స్టోరీ, హారర్ సర్వైవల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలోకి రానుంది.
షనయా కపూర్ తన తదుపరి చిత్రం ‘తూ యా మై’ తో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


