
📌 Key Points
- డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అద్దెకు ఇచ్చిన వారికి నోటీసులు జారీ చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.
- నోటీసులకు స్పందించని వారి ఇళ్లను రద్దు చేసి అర్హులకు కేటాయిస్తారు.
- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మంత్రులు సమీక్ష నిర్వహించారు.
- కాలనీల్లో విద్యుత్, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలని ఆదేశించారు.
తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంపై ప్రభుత్వం సీరియస్ అయింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అద్దెకు ఇస్తే చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
అద్దెకు ఇస్తే ఇక అంతే సంగతులు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల క్యూర్ (కోర్ అర్భన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణానికి అవసరమైన కార్యాచరణను సిద్దం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో నివసించే పేద ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా స్ధలాలను గుర్తించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి ఆలోచనలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని…. దీనికి తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.
సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సహచర మంత్రులు శ్రీధర్ బాబు గారు, అజారుద్దీన్ , పొన్నం ప్రభాకర్ తో కలిసి క్యూర్ ఏరియాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూం ఇళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు, అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్లకు పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక ఉండాలన్నారు. ఎలాంటి రాజకీయ వత్తిళ్లకు తలొగొద్దని అధికారులకు స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్షా సమావేశం
డబుల్ బెడ్ రూం ఇళ్లు పొంది వాటిలో నివసించకుండా అద్దెకు ఇస్తున్నవారికి, ఏళ్ల తరబడి తాళాలు వేసి ఖాళీగా ఉంచుతున్నవారికి నోటీసులు జారీ చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. నోటీసులకు స్పందించని వారి ఇళ్లను రద్ధు చేసి అర్హులైన పేదలకు కేటాయించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, ఎంతమంది స్పందించారు అక్కడ నివాసం ఉండకపోవడానికి వారు చెప్పిన కారణాలపై ఆరా తీశారు. 2 బిహెచ్కే, జెఎన్ ఆర్.ఎమ్ తదితర పథకాల్లో ఇళ్లు పొంది నివాసం ఉండని ఇళ్లను మే 1వ తేదీ నుంచి పరిశీలించాలన్నారు. అటువంటి వారికి నోటీసులు ఇచ్చి…. స్పందించని పక్షంలో కేటాయింపులను రద్దు చేయాలని స్పష్టం చేశారు.
నోటీసులపై స్పందించిన లబ్దిదారుల నుంచి బాండు పేపరుపై తాము ఇక్కడే నివాసం ఉంటామని లేదంటే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి అప్పగిస్తూ వారి నుంచి హామీ పొందాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు ఆమోదం తెలిపేలా అండర్ టేకింగ్ తీసుకోవాలని సూచించారు.
లబ్ధిదారులకు ముఖ్య గమనిక: నిబంధనలు పాటించాల్సిందే!
నాలుగు జిల్లాల పరిధిలోగల కాలనీల్లో ముఖ్యంగా విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజ్ వంటి కనీస వసతులను తప్పని సరిగా కల్పించాలని… ఈ విషయంలో జిహెచ్ ఎంసీ సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా 22వేల ఇళ్లకు విద్యుత్ మీటర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం టవర్లు మొత్తం పూర్తయ్యేవరకూ ఆగకుండా పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు లబ్దిదారులకు కేటాయించాలన్నారు. అదేవిధంగా వివిధ కాలనీల్లో ఉన్న వాణిజ్య సముదాయాలను అద్దె ప్రాతిపదకన గాకుండా వేలం పద్దతిలో వాటిని విక్రయించాలని ఆ విధంగా వచ్చిన డబ్బును అక్కడి సొసైటీ, ప్రభుత్వం పేరిట జాయింట్ అకౌంట్ పేరిట వేయాలన్నారు. అంతేగాక ప్రజా ప్రయోజన కార్యాలయాల కోసం కూడా కొన్నింటిని కేటాయించాలని తెలిపారు. ఈ విషయంలో సహకార శాఖ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.
ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఇళ్లను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.


