
📌 Key Points
- అమరావతిలో వైసీపీ మాజీ మంత్రుల వాహనశ్రేణిపై దాడి చోటుచేసుకుంది.
- చంద్రబాబు ప్రభుత్వం గూండాల రాజ్యమా అని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- భూ దోపిడీని కప్పిపుచ్చడానికే దాడులని వైఎస్ జగన్ ఆరోపించారు.
- పోలీసుల సహకారంపై వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అమరావతిలో వైసీపీ నేతలపై జరిగిన దాడిపై వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యమా, గూండాల రాజ్యమా అని ప్రశ్నిస్తూ, భూ దోపిడీని కప్పిపుచ్చడానికే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసుల పాత్రపైనా ఆయన మండిపడ్డారు.
అమరావతిలో వైసీపీ నేతలపై దాడి
రాజధాని ప్రాంతమైన అమరావతిలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజధాని బాధితులు, రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీల వాహనశ్రేణిపై దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నడుపుతోంది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక గూండాల రాజ్యమా అని ఆయన నిలదీశారు.
పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా విపక్ష నేతలపై దాడులు చేయించడం అత్యంత దారుణమని వైఎస్ జగన్ మండిపడ్డారు. అమరావతి పేరుతో సాగుతున్న భారీ అవినీతి, భూ దోపిడీ, రైతులపై జరుగుతున్న దౌర్జన్యాలు ఎక్కడ బయటకు వస్తాయోననే భయంతోనే చంద్రబాబు ఈ దాడులను ఉసిగొల్పారని ఆయన ఆరోపించారు. ఈ అరాచకానికి కొందరు పోలీసు అధికారులు సైతం సహకరించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు, అధికార పార్టీ రౌడీ మూకల దాడులకు కాపలా కాయడం దారుణమన్నారు. దగ్గరుండి ఈ దాడిని కో-ఆర్డినేట్ చేయడం చూస్తుంటే రాష్ట్రంలో చట్టపాలన పూర్తిగా పడకేసిందని స్పష్టమవుతోందని విమర్శించారు.
రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వని రైతులను చంద్రబాబు ప్రభుత్వం రకరకాలుగా వేధిస్తోందని వైఎస్ జగన్ వివరించారు. భూసేకరణ నోటీసుల పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేయడం, వారి పొలాలకు వెళ్లే దారులను ధ్వంసం చేయడం వంటి అమానుష చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల అనుమతి లేకుండానే వారి పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేస్తున్నారని….. కొండవీటి వాగు నీటిని బలవంతంగా వారి భూముల్లోకి మళ్లించి పంటలను సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వని రైతుల పొలాలను, వారి సంతకాలు మరియు అనుమతులు లేకుండానే రిటర్నబుల్ ప్లాట్ల కింద దొంగ రిజిస్ట్రేషన్లు చేయిస్తూ నరకయాతన పెడుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు పాలనపై జగన్ ప్రశ్నలు
అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్న చంద్రబాబు…. ఇంకా ఎవరి కోసం, ఎందుకు భూములు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. కేవలం తన బినామీలకు, పచ్చ నాయకులకు భూములు పంచిపెట్టడానికే పేద రైతులను నాశనం చేస్తున్నారా అని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో చంద్రబాబు తన అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి పూర్తిగా జంగిల్ రాజ్యాన్ని (అడవి చట్టాన్ని) స్థాపించారని వైఎస్ జగన్ మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజా గొంతుకలను అణచివేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ దుర్మార్గాలపై గతంలోనే తాము హెచ్చరించినా చంద్రబాబులో మార్పు రాలేదన్నారు. రోజురోజుకూ అరాచకాలు రెట్టింపు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
భూ దోపిడీ, పోలీసుల పాత్రపై ఆరోపణలు
చంద్రబాబు మొదలుపెట్టిన ఈ దుష్ట సంప్రదాయానికి భవిష్యత్తులో ప్రజల నుంచి రెట్టింపు స్పందన ఉంటుందని…. ప్రజలు ఈ అరాచకాలను ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడం ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. అమరావతి రైతుల పక్షాన నిలబడి చంద్రబాబు అవినీతిని…. దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చిచెప్పారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
అమరావతిలో జరిగిన ఈ దాడి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వైఎస్ జగన్ ఆరోపణలు, చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రజల్లో అనేక ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఈ ఘటనపై తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.


