
📌 Key Points
- రెండో విడత భూ సమీకరణ కింద రైతులకు ఎకరాకు రూ. 40 వేల కౌలు.
- ప్రతి సంవత్సరం కౌలు మొత్తంపై రూ. 3,000 పెంపుదల ఉంటుంది.
- భూమి ఇచ్చిన రైతు కుటుంబానికి రూ. 1.5 లక్షల వరకు పంట రుణం మంజూరు.
- మొదటి విడతలో 31,150 మంది రైతుల నుంచి 34,983 ఎకరాల భూమిని సేకరించారు.
రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడత భూసేకరణ చేపట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ. 40 వేల కౌలుతో పాటు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రెండో విడత భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయం
Amaravati phase II Land Pooling : రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతుల నుంచి రెండో విడత భూసేకరణ చేపట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే భూములిచ్చిన రైతులకు అండగా ఉండేందుకు ఏపీ సర్కార్…. మరో కీలక నిర్ణయం తీసుకుంది.
గ్రీన్ ఫీల్డ్ రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణ (Land Pooling Scheme – LPS) కింద భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రయోజనాలను ప్రకటించారు. ఈ రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 40 వేల చొప్పున పదేళ్ల పాటు కౌలు చెల్లిస్తామని ప్రకటించారు. ఇది వరకు ఎకరానికి ఏడాదికి కౌలు రూ.30 వేలుగా ప్రకటించగా…. దాన్ని ఇప్పుడు రూ.40 వేలకు పెంచారు.
కేవలం కౌలు మొత్తాన్ని ప్రకటించడమే కాకుండా, రైతులకు మరిన్ని ఆర్థిక వెసులుబాటులను కల్పించాలని సీఎం నిర్ణయించారు. ప్రతి ఏటా ఈ కౌలు మొత్తంపై రూ. 3,000 చొప్పున పెంపుదలఉంటుందని హామీ ఇచ్చారు. దీనితో పాటు…. భూములిచ్చిన ప్రతి రైతు కుటుంబానికి రూ. 1.5 లక్షల వరకు పంట రుణాన్ని మంజూరు చేసేందుకు కూడా ముఖ్యమంత్రి అంగీకరించారు.
రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు
శనివారం విడుదలైన అధికారిక ప్రకటనలోని వివరాల ప్రకారం…. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లోని 10 గ్రామాల రైతులు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం… రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
రాజధాని కోసం ఇప్పటివరకు సేకరించిన భూముల వివరాలను పరిశీలిస్తే…. మొదటి విడతలో 31,150 మంది రైతులు సుమారు 34,983 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. ప్రస్తుతం ప్రభుత్వం రెండో విడత కింద మరో 40,000 ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన
అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అదనపు భూమి అవసరమని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా పలుమార్లు ప్రకటించారు. అమరావతి చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) నిర్మాణం, రైల్వే స్టేషన్ ఏర్పాటు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం మరియు అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ వంటి భారీ ప్రాజెక్టుల కోసమే ఈ అదనపు భూ సమీకరణ చేపడుతున్నామని పేర్కొన్నారు. భూసేకరణతో రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన మరింత వేగవంతం కానుందని వివరిస్తున్నారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమరావతి అభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.


