|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాణసంచా గోదాములో భారీ పేలుడు.. ఏకంగా ఏడుగురు సజీవదహనం

Published: 09-06-2026, 4:46 PM
బాణసంచా గోదాములో భారీ పేలుడు.. ఏకంగా ఏడుగురు సజీవదహనం

రాజస్థాన్ రాజధాని జైపూర్‌ (Jaipur)లో ఘోరం చోటుచేసుకుంది. ఓ నివాస ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న టపాసుల గోదాములో (Firecracker Godown) భారీ పేలుడు సంభవించి ఏడుగురు కార్మికులు సజీవదహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. జైపూర్‌లోని తలాయ్ కాలనీ (Talai Colony)లోని ఓ ఇంట్లో టపాసులను అక్రమంగా నిల్వ ఉంచారు. ఇవాళ సాయంత్రం ఆ ఇంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు వేగంగా వ్యాపించాయి. లోపల పనిచేస్తున్న కార్మికులు బయటకు రాలేక, దట్టమైన పొగ, మంటల మధ్య చిక్కుకుపోయారు. ప్రమాద తీవ్రతకు కొందరు కార్మికులు బిల్డింగ్ బయటే స్పృహతప్పి పడిపోగా, స్థానికులు వెంటనే స్పందించి కొందరిని రక్షించే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్‌లు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

మంటల్లో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎస్ఎంఎస్ ఆసుప్రతి (SMS Hospital)కి తరలించగా అందులో మొదట ఐదుగురు. ఆ తర్వాత ఇద్దరు ప్రాణాలు కోల్పో్యారు. వారిలో సమీర్, ఆబిద్, నాసిర్, అబ్దుల్ వాహిద్, బిలాల్‌గా గుర్తించగా.. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. గోదాములో ప్రమాదకరమైన రసాయనాలు, సులభంగా మంటలు అంటుకునే పేలుడు పదార్థాలను భారీగా నిల్వ ఉంచడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ గోదాము యాజమాన్యం మరియు దానికి సంబంధించిన వివరాలపై జైపూర్ కలెక్టర్ సందేశ్ నాయక్ విచారణకు ఆదేశించారు. అదేవిధంగా ఈ ఘోర ప్రమాదంపై రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.