
అసోంలోని లఖింపూర్ జిల్లాలో ఉన్న దులంగ్ రిజర్వ్ ఫారెస్ట్లో అరుదైన బ్లాక్ పాంథర్ (నల్ల చిరుత) తొలిసారిగా కెమెరా ట్రాప్కు చిక్కింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బ్లాక్ పాంథర్ ఉనికి అసోం రిజర్వ్ అడవుల పర్యావరణ ప్రాధాన్యాన్ని, వన్యప్రాణి సంరక్షణ చర్యల విజయాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. జన్యుపరమైన మెలానిజం కారణంగా నల్లటి రంగులో కనిపించే చిరుతలనే బ్లాక్ పాంథర్లు అంటారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలోని దులంగ్ రిజర్వ్ ఫారెస్ట్ అరుదైన వన్యప్రాణులు, ఔషధ మొక్కలకు నిలయంగా ఉండగా, తాజా గుర్తింపు అక్కడి జీవవైవిధ్య ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పింది.


