
📌 Key Points
- మహిళా రిజర్వేషన్ చట్టం అమలులోకి తెస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల.
- చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించనున్నారు.
- 2029 ఎన్నికల నాటికి చట్టం అమలు చేయడానికి సవరణలు చేయనున్నారు.
- డీలిమిటేషన్ బిల్లుపై ఓటింగ్ నిర్వహణ, వ్యతిరేకిస్తున్న విపక్షాలు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించనున్నాయి. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మహిళా రిజర్వేషన్ చట్టం అమలులోకి తెచ్చిన కేంద్రం
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కేంద్ర సర్కార్ అమల్లోకి తీసుకువచ్చింది. చట్ట సభల్లో మహిళలకు 33% కోటాను కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం నిన్నటి నుంచే అమలులోకి వస్తుందని ప్రకటన చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 16ను చట్టం అమలు తేదీగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. 2029 ఎన్నికల్లో అమలు చేసేందుకు సంబంధించి ఇదే చట్టాన్ని సవరించాలని పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలోనే నోటిఫై చేసింది.
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
సాంకేతిక కారణాల వల్లే, ఇలా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తదుపరి జనగణన తర్వాత చేపట్టే డీలిమిటేషన్ ఆధారంగా మహిళలకు రిజర్వేషన్లు అమలు అవుతాయని ఇందులో స్పష్టంగా పేర్కొంది కేంద్రం. అంతకు మించి ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేయడంపై వివరాలను ఇంకా ఎక్కడ వెల్లడించలేదు. అయితే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన పద్ధతిపై కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్ అవుతున్నారు.
డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్షాలు
ఇది ఇలా ఉండగా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి డీలిమిటేషన్ బిల్లుపై ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. దీన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక అటు బిల్లు ఆమోదం పొందడానికి కావలసిన 360 ఓట్లు కూడగట్టేందుకు అధికార ఎన్డీఏ ప్రయత్నాలు చేస్తోంది.
మొత్తానికి మహిళా రిజర్వేషన్ చట్టం అమలులోకి రావడంతో రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.


