
రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ షూటింగ్ సమయంలో వరుస ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా మలయాళ నటుడు కళాభవన్ విజు మరణించారు. ఈ విషాదాలకు పంజుర్లి దేవుని ఆగ్రహం కారణం అంటూ పుకార్లు వస్తున్నాయి.
Key Points
కాంతార చిత్ర షూటింగ్ సమయంలో వరుస ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నాయి.
కళాభవన్ విజు, రాకేశ్ పూజారి వంటి నటుల మరణాలు చిత్రయూనిట్ను కలచివేశాయి.
అడవిలో షూటింగ్ నియమాల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటోంది.
పంజుర్లి దేవుని ఆగ్రహం వల్ల ఈ విషాదాలు జరుగుతున్నాయని పుకార్లు.
కాంతార చిత్రీకరణలో వరుస ప్రమాదాలు
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ( Rishab Shetty ) నటించిన బ్లాక్బస్టర్ మూవీ కాంతార ( Kantara Movie ). 2022లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు రూ.16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారీ సక్సెస్ సాధించిన ఈ చిత్రానికి మేకర్స్ ప్రీక్వెల్ (కాంతార: చాప్టర్ 1) ప్రకటించారు.
అయితే ఏ ముహూర్తాన కాంతార 1 ప్రకటించారో కానీ అప్పటినుంచి ఏదో ఒక అడ్డంకులు, విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కాంతార నటుడు, మలయాళ మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ విజు (43) గుండెపోటుతో మరణించాడు. తీర్థహళ్లిలో చిత్రయూనిట్తో బస చేసిన అతడికి బుధవారం రాత్రి ఛాతీలో నొప్పి వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్నుమూశాడు. ఇతడు మాలికాపురం, మార్కో వంటి పలు చిత్రాల్లో నటించాడు. 25 ఏళ్లుగా మిమిక్రీ రంగంలో రాణిస్తున్నాడు.
నటుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి
గతంలో.. షూటింగ్ ప్రారంభించిన కొత్తలో కర్ణాటకలోని ముడూరులో 20 మంది జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగనప్పటికీ పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారేమో తీవ్రమైన గాలివాన వల్ల భారీ సెట్ కూలిపోయింది. ఇటీవల మలయాళ జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తూ నదిలో మునిగి విగతజీవిగా తేలాడు. ఆ తర్వాత కన్నడ నటుడు, హాస్య నటుడు రాకేశ్ పూజారి (33) గుండెపోటుతో మరణించాడు. ఇప్పుడు కళాభవన్ కన్నుమూశాడు. ఈ వరుస విషాదాలు కాంతార చిత్రయూనిట్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
అడవిలో పేలుళ్లు అయితే నియమాలను ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో కాంతార సినిమా చిత్రీకరిస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ఆరోపణలు వచ్చాయి. అడవిలో పెద్ద మంటలు వేసి షూటింగ్ చేస్తున్నారని, పేలుళ్లతో ఏనుగులు బెదిరిపోయి గ్రామాల మీదకు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ విషయం అక్కడి అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె దృష్టికి రాగా.. తక్షణమే షూటింగ్ ఆపేయాలని అధికారులను ఆదేశించారు.
పంజుర్లి దేవుని ఆగ్రహం పుకార్లు
ఇకపోతే పంజుర్లి దేవుడి ఆగ్రహంతోనే ఇలా జరుగుతోందన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. కాంతార సినిమాతోనే పంజుర్లి దేవుడు గురించి వెలుగులోకి వచ్చింది. పంజుర్లి అంటే పంది. చెడు చేసేవారిని శిక్షించి, మంచిని ఆశీర్వదించే భగవంతుడే పంజుర్లీ అని నమ్ముతారు.
కాంతార చిత్రయూనిట్కు ఈ వరుస విషాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అడవిలోని షూటింగ్కు సంబంధించిన నియమాల ఉల్లంఘన మరియు పంజుర్లి దేవుని ఆగ్రహం ఈ సంఘటనలకు కారణమేనా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం.


