
📌 Key Points
- ‘కాంతార’ తరహాలో తులునాడు దైవమైన ‘కొరగజ్జ’ కథతో సినిమా
- సినిమాను త్రీడీ ఫార్మాట్లోకి మార్చాలని అంతర్జాతీయ బృందం సలహా
- ప్రేక్షకులకు మెరుగైన అనుభూతిని అందించేందుకు క్లైమాక్స్ రీషూట్
- మోహన్లాల్ స్టూడియోలో ప్రత్యేక సెట్లో నీటి అడుగున సన్నివేశాల చిత్రీకరణ
‘కాంతార’ చిత్రంలాగే, తులునాడు ప్రాంతానికి చెందిన కొరగజ్జ దైవం కథతో ఒక సినిమా రాబోతోంది. ఈ సినిమాను త్రీడీ ఫార్మాట్లోకి మారుస్తున్నారు. మోహన్లాల్ స్టూడియోలో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారు.
‘కాంతార’ తరహాలో ‘కొరగజ్జ’ చిత్రం
Koragajja: ‘కాంతార’ (Kantara) సిరీస్ చిత్రాలు ప్రేక్షకులకు ఎలాంటి ట్రీట్ను ఇచ్చాయో తెలిసిందే. జెన్యూన్ కంటెంట్తో వచ్చిన ఈ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ‘కాంతార’ తరహాలోనే తులునాడు ప్రాంతంలో అత్యంత పవిత్రంగా పూజించబడే దైవమైన ‘కొరగజ్జ’ కథ ఆధారంగా ఓ శక్తివంతమైన సినిమా రాబోతోంది. ‘కొరగజ్జ’ (Koragajja) అనే టైటిల్తో త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్లపై త్రివిక్రమ్ సాపల్య (Trivikram Sapalya) నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ (Sudhir Attavar) దర్శకత్వం వహిస్తున్నారు. ఒక్క దర్శకత్వమే కాదు.. కథా రూపకల్పన, స్క్రీన్ప్లే, సంభాషణలను కూడా ఆయనే స్వయంగా అందిస్తుండటం విశేషం. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో మేకర్స్ ఈ సినిమాను వాయిదా వేసుకున్నారు. అందుకు కారణం ఏమిటో తాజాగా మేకర్స్ తెలియజేశారు.
ఈ చిత్రాన్ని చూసిన అంతర్జాతీయ బృందం ఇచ్చిన సలహా మేరకు ఈ సినిమాను వాయిదా వేశారట. ఈ మూవీని త్రీడీ ఫార్మాట్లోకి మార్చితే ఇంకా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని వారు చెప్పారట. ఈ చిత్రాన్ని ‘ప్రపంచ స్థాయి చిత్రం’గా వారు అభివర్ణించారని.. సినిమాలోని లొకేషన్లు, నిర్మాణ నాణ్యత, సినిమాటిక్ స్థాయిని మెచ్చుకున్నారని.. ఈ మూవీని త్రీడీ ఫార్మాట్లోకి మార్చాలని వారు ఇచ్చిన సలహాతోనే సినిమాను వాయిదా వేశామని తాజా అప్డేట్తో చిత్రయూనిట్ తెలియజేసింది. సినిమాను 2డీ నుంచి 3డీకి మార్చేందుకు టీమ్కు చాలా టైం కావాల్సి వస్తోందని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాతే విడుదల తేదీని ప్రకటిస్తామని తాజాగా మేకర్స్ తెలియజేశారు.
సినిమాను త్రీడీలోకి మార్చడానికి కారణం
ఈ అప్గ్రేడ్పై దర్శకుడు సుధీర్ అత్తవార్ స్పందిస్తూ.. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం దాదాపు 40 మంది నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక బృందం ఈ త్రీడీ ఫార్మాట్ కోసం పనిచేస్తోంది. ప్రేక్షకులకు సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను మరింత మెరుగ్గా ఇవ్వడానికి క్లైమాక్స్ను నీటి అడుగున తిరిగి చిత్రీకరించాం. ఈ సన్నివేశాన్ని కేరళలోని తిరువనంతపురంలో ఉన్న మలయాళ స్టార్ మోహన్లాల్కు చెందిన ‘విస్మయ’ స్టూడియోలో చిత్రీకరించాం. ఈ షూట్ కోసం ప్రత్యేకంగా నీటి అడుగున సెట్ను నిర్మించి, సినిమాటోగ్రాఫర్ మనోజ్ పిళ్ళై నాలుగు కెమెరాలను ఉపయోగించి చిత్రీకరించారు.
మోహన్లాల్ స్టూడియోలో క్లైమాక్స్ షూటింగ్
డాక్టర్ రాజ్కుమార్ తర్వాత కన్నడ చిత్రసీమలో అరుదైన సంఘటనగా నటి శృతి నీటి అడుగున సన్నివేశాలలో స్వయంగా నటించారు. అత్యంత ప్రమాదకరమైన ఈ స్టంట్స్ చేయడానికి ముందు ఆమె దాదాపు 15 రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. షూటింగ్ అంతటా స్కూబా డైవర్లు, వైద్య సిబ్బంది, అంబులెన్స్తో సహా భద్రతా బృందాలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి ఆమె హార్నెస్ ధరించి నీటిలోకి దూకి, కెమెరా ముందే పైకి తేలడం అనేది ఈ చిత్రంలోని ప్రధాన హైలెట్లలో ఒకటి. ఈ సీన్ చూసే వారికి గూస్బంస్స్ వస్తాయి. మరో విశేషం ఏమిటంటే.. ఆక్సిజన్ సహాయం లేకుండా దాదాపు 22 సెకన్ల పాటు శృతి నీటి లోపల చిత్రీకరణలో పాల్గొని, తన డెడికేషన్ను తెలియజేశారని చెప్పుకొచ్చారు. ఈ మార్పులు, చేర్పులు సినిమా బడ్జెట్పై కూడా ప్రభావం చూపించాయని, కేవలం నీటిలోపలి సన్నివేశం కోసమే నిర్మాత త్రివిక్రమ్ సపల్య అదనంగా 12 కోట్లు ఖర్చు పెట్టారని ఎగ్జిక్యూటివ్ నిర్మాత విద్యాధర్ శెట్టి తెలిపారు.
మొత్తానికి ‘కొరగజ్జ’ చిత్రం ‘కాంతార’లాగే ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది. త్రీడీ ఫార్మాట్లో రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


