
📌 Key Points
- మంత్రి పొంగులేటి కుమారుడు భూములు కబ్జా చేశారని కేటీఆర్ ఆరోపించారు.
- సతీష్ షా కుటుంబానికి చెందిన గోశాలను పొంగులేటి అనుచరులు కూల్చివేశారని ఆరోపణ.
- భూమి ఇవ్వకపోతే 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారని కేటీఆర్ తెలిపారు.
- కేటీఆర్ ఆరోపణల నేపథ్యంలో మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
వట్టినాగులపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. భూ కబ్జా ఆరోపణలు చేస్తూ, మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఆయన పలు విషయాలు వెల్లడించారు.
పొంగులేటిపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పర్యటించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసింది. పొంగులేటి కుమారుడు భూములను కబ్జా చేశాడని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ… 1960 నుంచే ఇక్కడ సతీష్ షా కుటుంబానికి భూమి ఉందన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వారి పేరు మీదనే భూమి ఉందని తెలిపారు. వట్టినాగులపల్లి గ్రామం అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ భూముల విలువలు భారీగా పెరిగాయన్నారు. ఇలాంటి భూములపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నుపడిందని ఆరోపించారు.
“మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు హర్షా రెడ్డి కలిసి స్వయంగా సతీష్ షా ఇంటికి వెళ్లి, భూమిని డెవలప్మెంట్కు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారు. అయితే సతీష్ షా కుటుంబం భూమిని డెవలప్మెంట్కు ఇవ్వడానికి గానీ, అమ్మడానికి గానీ సిద్ధంగా లేమని స్పష్టంగా తెలిపింది. దీనికి తరువాత మంత్రి పొంగులేటి అరాచకాలకు తెరలేపారు. తన రెవెన్యూ శాఖలోని శ్రీనివాసులు అనే అధికారి ద్వారా, రూ. 100 కోట్ల లంచం కేసులో పట్టుబడిన ఏడీతో దొంగ సర్వే చేయించి బాధితులను తీవ్రంగా వేధింపులకు గురిచేశారు. భూమిని ఇవ్వకపోతే, రెవెన్యూ సర్వే పేరుతో 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు” అని కేటీఆర్ చెప్పారు.
భూ కబ్జాకు పాల్పడ్డారని ధ్వజం
“దీనికి లొంగకపోవడంతో హర్షా రెడ్డి, ఆయనకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ గుండాలతో కలిసి, నంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో వచ్చి బాధితులు నిర్మించుకున్న గోశాలను కూల్చివేశారు. దాదాపు కిలోమీటర్ మేర ఉన్న కాంపౌండ్ వాల్ను కూడా ధ్వంసం చేసి, బాధితులను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన సతీష్ షా, పల్లవి షా కుటుంబ సభ్యులను అక్కడే సజీవంగా పాతిపెడతామని బెదిరించి… రాత్రంతా నిలబెట్టారు. ఈ ఘటనపై పోలీసులు వద్ద ఫిర్యాదు చేయగా… ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాష్ట్రపతి పతకం అందుకున్న నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లాను బదిలీ చేశారు” అని కేటీఆర్ వివరించారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి మధ్య ఉన్న వ్యాపార అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని ఈ దురాగతాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. “కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని కోటి ఎకరాలకు పెంచి, నిషిద్ధ జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50 శాతం భూమి వాటా డిమాండ్ చేస్తోంది. ఇలాంటి అన్యాయాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే తెలంగాణ భవన్కు వచ్చి వివరాలు ఇవ్వాలి. వారికి పార్టీ పరంగా, న్యాయపరంగా అండగా ఉంటాం” అని కేటీఆర్ ప్రకటించారు.
మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్
అక్రమంగా క్రషర్లు ఏర్పాటు చేసి మైనింగ్ చేస్తున్న మంత్రి పొంగులేటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ను ప్రశ్నించిన మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ను కలుస్తున్నామని…. త్వరలో మరిన్ని కుంభకోణాలను బయటపెడతామన్నారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
మంత్రి పొంగులేటిపై కేటీఆర్ చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


