
📌 Key Points
- పవన్ కళ్యాణ్ హనుమకొండలోని అభిమాని నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శ.
- అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్కు లక్ష రూపాయల ఆర్థిక సాయం.
- నిరంజన్ కోరిక మేరకు కుక్కపిల్ల కొనిస్తానని హామీ, ఇంటి యజమానులతో స్వయంగా మాట్లాడిన పవన్.
- నిరంజన్ కుటుంబానికి శాశ్వత జీవనోపాధి కోసం క్యాంటీన్ ఏర్పాటుకు ఆదేశం.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హనుమకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ను పరామర్శించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆర్థిక సాయంతో పాటు, నిరంజన్ కోరికలు తీర్చి, కుటుంబానికి జీవనోపాధికి భరోసా కల్పించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అభిమాని నిరంజన్ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రాజకీయ బిజీ షెడ్యూల్లోనూ ఓ అభిమాని చివరి కోరికను మన్నించి, అతని ఇంటికి వెళ్లి పరామర్శించి పెద్ద దిక్కుగా నిలిచారు.
తెలంగాణ రాష్ట్రం, హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ అనే యువకుడు ‘డి.ఎన్.డి’ (DMD) అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఎదుగుదల లేక, కనీసం మంచం పైనుంచి లేవలేని స్థితిలో ఉన్న నిరంజన్.. తన కోరికగా పవన్ కళ్యాణ్ను కలవాలని ఆశపడ్డాడు. తెలంగాణ జనసేన నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, బుధవారం స్వయంగా నిరంజన్ నివాసానికి చేరుకున్నారు.
మంచానికే పరిమితమైన నిరంజన్ను చూసి పవన్ కళ్యాణ్ తీవ్రంగా చలించిపోయారు. ఆ అభిమాని మంచం పైనే కూర్చుని, అతన్ని ఆత్మీయంగా హత్తుకున్నారు. నుదిటిపై ముద్దు పెట్టి ఆప్యాయంగా పలకరించారు. ‘చిన్ననాటి నుంచి మీరంటే నాకు ఎంతో అభిమానం సార్.’ అని నిరంజన్ నెమ్మదిగా చెబుతుంటే పవన్ మనసు కరిగిపోయింది. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తెప్పించిన పట్టువస్త్రాన్ని నిరంజన్కు కప్పి, అక్షతలు ఇచ్చి దీవించారు.
కుక్కపిల్ల హామీ, లక్ష రూపాయల ఆర్థిక సాయం
నిరంజన్ ఆరోగ్యం బాగున్న సమయంలో పవన్ కళ్యాణ్ పాటలకు చేసిన డ్యాన్స్ వీడియోలను, ఫోటోలను పవన్ ఆసక్తిగా తిలకించారు. తనను అంతా ప్రేమగా ‘చోటా గబ్బర్ సింగ్’ అని పిలుస్తారని నిరంజన్ చెప్పడంతో అక్కడ కాసేపు నవ్వులు విరిశాయి.
నిరంజన్ తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసలతో మాట్లాడిన పవన్.. బాబు ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, భగవంతుడి ఆశీస్సులు బాబుకు ఉంటాయని భరోసా ఇచ్చారు. వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సాయంగా రూ. 1,00,000 (లక్ష రూపాయలు) ఆర్థిక సాయాన్ని అందజేశారు.
పరామర్శ సమయంలో ఓ కుక్క పిల్ల బొమ్మను చూపించి, దానిని పెంచుకోవాలని ఉందని నిరంజన్ కోరగా.. తప్పకుండా కొని పంపిస్తానని పవన్ హామీ ఇచ్చారు. అయితే ఇల్లు అద్దెది కావడం వల్ల ఓనర్లు ఒప్పుకోరని నిరంజన్ తండ్రి చెప్పడంతో.. పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ ఇంటి యజమానులను పిలిపించి మాట్లాడి, బాబు కోరిక తీర్చాలని కోరారు.
కుటుంబానికి శాశ్వత జీవనోపాధి భరోసా
నిరంజన్ కుటుంబం గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటీన్లో పనిచేసేవారమని చెప్పడంతో, వారి శాశ్వత జీవనోపాధి మెరుగుపర్చేందుకు ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
నిరంజన్ పరామర్శ ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ నేరుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి బయలుదేరి వెళ్లారు. నిరంజన్ త్వరగా కోలుకోవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి వెండి ప్రతిమకు పూజ చేయించి ఆ కుటుంబానికి అందజేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్తో పాటు జనసేన పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ నాయకులు రాధారం రాజలింగం, ఆర్.కె.సాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
పవన్ కళ్యాణ్ చూపిన ఈ మానవత్వం, అభిమానుల పట్ల ఆయనకున్న ప్రేమను మరోసారి నిరూపించింది. రాజకీయాలకు అతీతంగా సామాజిక బాధ్యతను గుర్తుచేస్తూ, అనేకమందికి ఆదర్శంగా నిలిచింది.


