
దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ‘రిపబ్లిక్ టీవీ సమిట్ 2026’ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) భారతదేశ వారసత్వం, భవిష్యత్తు ప్రణాళికలపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తాత్కాలికంగా, అప్పటికప్పుడు జరిగే చిన్న చిన్న అంతర్జాతీయ సంఘటనలకు భారత్ ఎన్నడూ హఠాత్తుగా, ఆవేశపూరితంగా స్పందించే దేశం కాదని ప్రధాని స్పష్టం చేశారు. భరతజాతి ఎన్నో శతాబ్దాలుగా అపారమైన వృద్ధిని, అదే సమయంలో ఎన్నో వినాశనాలను కళ్లారా చూసి, వాటన్నింటినీ తట్టుకుని నిలబడిన ఒక గొప్ప నాగరికత అని ప్రధాని మోడీ కొనియాడారు.
భారతదేశం తన అంతశ్చేతనలో యుగయుగాల నాటి ‘మెమరీ చిప్ ను మోస్తున్న శక్తివంతమైన దేశమని, తాను ఈ మాటలను ఎంతో బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి చెప్తున్నానని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం భారతదేశం ఆర్థిక, సాంకేతిక రంగాలలో తీసుకుంటున్న ప్రతి నిర్ణయం, చేస్తున్న ప్రతి పని.. కేవలం వర్తమానం కోసమే కాదని, రాబోయే వెయ్యి సంవత్సరాల ఉజ్వల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దడానికేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశం సాధిస్తున్న ఈ స్థిరత్వ ప్రగతి ప్రపంచ సవాళ్లకు ఒక దిక్సూచిగా మారుతుందని ప్రధాని పేర్కొన్నారు.


