
📌 Key Points
- తెలంగాణలోని 5008 అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణకు కేంద్రం రూ.30.04 కోట్లు కేటాయించింది.
- కేంద్రాల ఆధునీకరణలో ఎల్ఈడీ స్క్రీన్లు, నీటి శుద్ధి వ్యవస్థలు, పోషణ్ వాటిక వంటి సదుపాయాలు ఉంటాయి.
- అంగన్వాడీ కేంద్రాలకు పోషకాలు కలిపిన బియ్యం సరఫరా చేస్తారు; చిరుధాన్యాల వినియోగానికి ప్రాధాన్యత ఇస్తారు.
- మేడ్చల్-మల్కాజిగిరిలో 948, భద్రాద్రి-కొత్తగూడెంలో 509 కేంద్రాలు అప్గ్రేడ్ అవుతున్నాయి.
తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాలకు కేంద్రం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని 5008 అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించేందుకు రూ.30.04 కోట్లు కేటాయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన చేశారు.
సక్షమ్ అంగన్వాడీలుగా ఆధునీకరణ
తెలంగాణలోని 5,008 అంగన్వాడీ కేంద్రాలను రూ.30.04 కోట్ల వ్యయంతో ‘సక్షమ్ అంగన్వాడీలు’గా ఆధునీకరించాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. మెరుగైన పోషణ, బాల్య సంరక్షణ, విద్యను అందించే లక్ష్యంతో ‘మిషన్ సక్షమ్ అంగన్వాడీ’, ‘పోషణ్ 2.0’ పథకాల కింద, దేశవ్యాప్తంగా ప్రభుత్వ భవనాల్లో ఉన్న దాదాపు రెండు లక్షల అంగన్వాడీ కేంద్రాలను మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు.
ఆధునీకరించే ఈ ‘సక్షమ్ అంగన్వాడీలు’ సంప్రదాయ కేంద్రాలతో పోలిస్తే మెరుగైన మౌలిక సదుపాయాలతో ఉంటాయి. వీటిలో ఎల్ఈడీ స్క్రీన్లు, నీటి శుద్ధి వ్యవస్థలు, పోషణ్ వాటిక, బాల్య విద్యకు సంబంధించిన బోధనా సామాగ్రి, ‘Building as Learning Aid’ (BaLA) చిత్రలేఖనాలు వంటి సదుపాయాలు ఉంటాయని కిషన్ రెడ్డి తెలిపారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పోషక మద్దతును అందించే సప్లిమెంటరీ న్యూట్రిషియన్ ప్రోగ్రామ్, రికమండరీ డైటరి అలవెన్స్(RDA), సగటు రోజువారీ ఆహార వినియోగం (ADI) మధ్య ఉన్న అంతరాన్ని పూరించడానికి ప్రధానంగా రూపొందించినట్టుగా పేర్కొన్నారు.
మెరుగైన సదుపాయాలు, పోషకాహారం
సూక్ష్మపోషకాల అవసరాలను తీర్చడానికి, మహిళలు, పిల్లలలో రక్తహీనతను నియంత్రించడానికి అంగన్వాడీ కేంద్రాలకు ‘ఫోర్టిఫైడ్ రైస్’ (పోషకాలు కలిపిన బియ్యం) సరఫరా చేయబడుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల్లో వండే భోజనం, ఇంటికి తీసుకెళ్లే రేషన్ తయారీలో, వారానికి కనీసం ఒక్కసారైనా చిరుధాన్యాలను (millets) వినియోగించడంపై కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లా వారీగా చూస్తే అప్గ్రేడ్ చేసే ఈ కేంద్రాలలో మేడ్చల్-మల్కాజిగిరిలో 948, భద్రాద్రి-కొత్తగూడెంలో 509, కరీంనగర్లో 365, సంగారెడ్డిలో 298, జనగాంలో 278, సిద్దిపేటలో 238, నారాయణపేటలో 232, కామారెడ్డిలో 226, సూర్యాపేటలో 180, రంగారెడ్డిలో 176, రాజన్న-సిరిసిల్లలో 171 కేంద్రాలు ఉన్నాయి.
చిరుధాన్యాలకు ప్రాధాన్యత
ఇతర జిల్లాల్లో నల్గొండలో 156, వనపర్తిలో 153, మహబూబ్నగర్, మెదక్లో 130, జగిత్యాలలో 107, కొమరం భీమ్–ఆసిఫాబాద్లో 105, వికారాబాద్, నిజామాబాద్లో 90 చొప్పున, పెద్దపల్లిలో 66, హనుమకొండలో 65, వరంగల్లో 54, నాగర్కర్నూలులో 51 ఉండగా.. జయశంకర్ భూపాలపల్లిలో 50, బయ్యారంలో 47, ఆదిలాబాద్లో 29, యాదాద్రి-భువనగిరిలో 18, ములుగులో 17, జోగులాంబ-గద్వాల్లో 15, హైదరాబాద్లో 10, నిర్మల్లో 9, మహబూబాబాద్లో మూడు చొప్పున ఉన్నట్టుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
ఈ ఆధునీకరణ ద్వారా అంగన్వాడీ కేంద్రాలు మరింత మెరుగైన సేవలను అందిస్తాయని, పిల్లల మరియు మహిళల ఆరోగ్యానికి మరింత తోడ్పాటునందిస్తుందని ఆశిస్తున్నారు.


