
📌 Key Points
- విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా విడుదల సెన్సార్ సమస్యల వల్ల వాయిదా పడింది.
- సినిమాకు మొదట U/A సర్టిఫికెట్ ఇచ్చి, తర్వాత రివైజింగ్ కమిటీకి పంపడం వివాదానికి దారితీసింది.
- మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ నిర్మాతలకి అనుకూలంగా తీర్పు ఇవ్వగా, డివిజన్ బెంచ్ స్టే విధించింది.
- తమకు ముందుగా ఇచ్చిన సర్టిఫికెట్ను అమలు చేయాలని నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దళపతి విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా చుట్టూ వివాదం నెలకొంది. సెన్సార్ సమస్యలతో విడుదల వాయిదా పడగా, నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సినిమా భవితవ్యం ఇప్పుడు కోర్టు తీర్పుపై ఆధారపడి ఉంది.
సినిమా విడుదలలో సెన్సార్ చిక్కులు
Thalapathy Vijay: తళపతి విజయ్ నటించిన తాజా చిత్రం జన నాయగన్.. చుట్టూ ఇప్పుడు పెద్ద చట్టపరమైన వివాదం నడుస్తోంది. ఈ సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. ఈ అంశం అభిమానుల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది.
సినిమాను నిర్మాతలు డిసెంబర్ 18, 2025నCentral Board of Film Certificationకు పంపించారు. డిసెంబర్ 22న సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇవ్వాలని తెలిపింది. కొన్ని చిన్న మార్పులు సూచించడంతో నిర్మాతలు అవన్నీ పూర్తి చేసి మళ్లీ సినిమాను సమర్పించారు. అయితే అధికారిక సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. అనూహ్యంగా సినిమాను రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు బోర్డు సమాచారం ఇచ్చింది.
ఇది ఎందుకు జరిగిందో స్పష్టమైన కారణాలు చెప్పకపోవడంతో.. సమయం చాలా తక్కువగా ఉండటంతో నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సింగిల్ బెంచ్, “ముందుగా U/A సర్టిఫికేట్ ఇచ్చి, తర్వాత ఎందుకు రివ్యూకి పంపారు?” అంటూ సెన్సార్ బోర్డును ప్రశ్నించింది. చివరికి నిర్మాతలకే అనుకూలంగా తీర్పు ఇచ్చి, ముందుగా ఇచ్చిన U/A సర్టిఫికేట్ను అమలు చేయాలని ఆదేశించింది.
హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సెన్సార్ బోర్డు
అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసింది. డివిజన్ బెంచ్ విచారణ అనంతరం సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది. దీంతో సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఈ మొత్తం పరిణామాలపై నిర్మాతలు మరోసారి న్యాయపరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. తమకు ముందుగా ఇచ్చిన U/A సర్టిఫికేట్ను అమలు చేసి, సినిమా విడుదలకు మార్గం సాఫీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిర్మాత కే. వెంకట్ నారాయణ మాట్లాడుతూ, “సినిమాను సమయానికి విడుదల చేయడానికి మేము సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేశాం. ప్రేక్షకులు, అభిమానులు మాకు సహకరించారు” అని తెలిపారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిర్మాతలు
ఇది విజయ్ చివరి సినిమా కావడం వల్ల ఈ వివాదం మరింత చర్చకు దారి తీసింది. విజయ్ రాజకీయంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనే కారణంతోనే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే నిర్మాతలు మాత్రం న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, త్వరలోనే సినిమా థియేటర్లలో విడుదల అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో ‘జననాయగన్’ విడుదల మరింత ఆసక్తిగా మారింది. నిర్మాతలు న్యాయవ్యవస్థపై నమ్మకంతో ఉన్నారు. సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.


