
బాలనటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, హనుమాన్ సినిమాతో స్టార్ హీరోగా ఎదిగాడు తేజ సజ్జా. తాజాగా, చిరంజీవి గారితో తన అనుబంధం గురించి ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
Key Points
చిరంజీవి గారి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం లభించింది.
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.
మిరాయ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నాడు.
చిరంజీవి గారితో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకున్నాడు.
చిరంజీవితో తేజ సజ్జా ప్రయాణం
Teja Sajja Mirai:బాల నటుడుగా ఎన్నో సినిమాల్లో నటించి హీరోగా ఎదిగాడు తేజా సజ్జా. హీరో గా ‘హనుమాన్’తో వచ్చాడు. ఈ మూవీ ఏకంగా రూ.300 కోట్లు కొల్లగొట్టి, పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఇలా తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుని స్టార్ హీరో అయిపోయాడు. తన క్రేజ్ని మరింత పెంచుకునేందుకు మరోసారి సూపర్ యోధ కథనే సెలక్ట్ చేసుకున్నారు. ‘మిరాయ్’ అనే అడ్వెంచర్ థ్రిల్లర్ తో మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
‘మిరాయ్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో తేజ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. తాజాగా సజ్జా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్, మొదటి అవకాశాలు, చిరంజీవి వారితో ప్రత్యేక అనుబంధం, ఇండస్ట్రీలో ఎదురైన సవాళ్లు , పర్సనల్ ఎక్స్పీరియెన్స్లను పంచుకున్నారు. చిరంజీవి గారి వల్లనే తాను సినిమాల్లోకి వచ్చానని తెలిపారు. ఆ తరువాత చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశానని తెలిపారు. ఇక ‘ఓ బేబి’ మూవీ టైంలో సమంత తనకు చాలా సపోర్ట్ చేశారనీ, ఆ మూవీ ప్రమోషన్స్కు కూడా నన్నే పంపేవారనీ, తన గురించి అందరికీ చెప్పేవారని గుర్తుకు చేసుకున్నారు.
‘హనుమాన్’ సినిమా విజయం
తన ఫ్యామిలీలో ఎవరూ ఇండస్ట్రీకి సంబంధించిన వారు లేరని చెప్పారు తేజ సజ్జా. ‘చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుల కోసం వందల కొద్దీ ఫోటోస్ వచ్చాయి. అందులో చిరంజీవి గారు నా ఫోటో సెలెక్ట్ చేశారు. ఆ రోజు నా ఫోటో సెలక్ట్ చేసి ఉండకపోతే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ‘చూడాలని ఉంది’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా అవకాశాన్ని మెగాస్టార్ ఇచ్చారు. ఆ తర్వాత మా నాన్నను నిర్మాత ఒప్పించారు. మెగాస్టార్ ఆ రోజు నా ఫోటో సెలక్ట్ చేసి ఉండకపోతే.. నేను నేడు ఇలా ఇక్కడ ఉండేవాడిని కాదు. ఆ ఒక్క ఫోటో నా జీవితాన్నే మార్చేసింది. అలా నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత వరుసగా మూవీస్ చేశాను”అని తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి తనను సొంత పిల్లాడిలా చూసుకుంటారని చెప్పారు తేజ. తాను చిన్నప్పుడు నుండే ఇండస్ట్రీలోకి గొప్ప వ్యక్తుల మధ్య పెరిగాననీ, మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు అపారమైన గౌరవమని తెలిపారు. చిరు గారికి ఎన్ని టెన్షన్స్ ఉన్నా అందరి బాగోగులు చూస్తారనీ, హనుమాన్ మూవీ చూసిన తరువాత తనకు ఫోన్ చేసి దాదాపు 20 నిమిషాలు మాట్లాడారనీ, భవిష్యత్తులో ఎలా ఉండాలో ? ఎలాంటి సినిమాలు చేయాలో సూచించారని గుర్తుకు చేసుకున్నారు.
‘మిరాయ్’ సినిమా రిలీజ్
ఇండస్ట్రీలో హీరోగా మొదటి అడుగు పెట్టిన తర్వాత తాను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నట్టు తేజ తెలియజేశారు. “ఎన్నో అవమానాలు, తిరస్కరణలు, మోసాలు చూశాను. ఒకసారి స్టార్ డైరెక్టర్ కథ చెప్పి షూటింగ్ మొదలు పెట్టారు, 15 రోజులు షూట్ అయిపోయాక మరో హీరో సెట్స్కి వచ్చాడు. ఆ మూవీలో అతనే హీరో అని నాకు అర్థమైంది. మొదట కథ చూపించినంత వరకు నాకు తెలియలేదు. అతనికి సీన్స్ చూపించడం కోసమే నాతో మాక్ షూట్ చేశారని తెలిసింది”అని తేజ తన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. తాజాగా ‘మిరాయ్’ మూవీ, యంగ్ ప్రేక్షకుల కోసం ఆసక్తికరమైన అడ్వెంచర్-థ్రిల్లర్ అనుభవం అందించనుంది. ఇప్పటికే టీం ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి.
చిరంజీవి గారితో తన అనుబంధం, ‘హనుమాన్’ విజయం తర్వాత ‘మిరాయ్’ సినిమాతో తన కెరీర్ కొనసాగించేందుకు తేజ సజ్జా సిద్ధమవుతున్నాడు. ఈ యువ నటుడి భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుందాం.


