
📌 Key Points
- అమెరికా యుద్ధ నౌకలు హార్మూజ్ జలసంధిని దాటడం సంచలనంగా మారింది.
- ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ పేరుతో అమెరికా ఈ ఆపరేషన్ చేపట్టింది.
- జలసంధిలో ఇరాన్ మైన్లను తొలగించడమే లక్ష్యమని అమెరికా తెలిపింది.
- అమెరికా చర్యను ఇరాన్ ఖండించగా, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
అమెరికా యుద్ధ నౌకలు హార్మూజ్ జలసంధిని దాటడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ చర్య ఇరాన్తో ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉంది. దీనిపై ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హార్మూజ్ జలసంధిలో అమెరికా నౌకలు
శనివారం అమెరికా యుద్ధ నౌకలు హార్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. అయితే ఫిబ్రవరి 28న ఇరాన్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత, హర్మూజ్ జలసంధిని అమెరికా యుద్ధ నౌకలు దాటడం ఇదే మొదటిసారి కావడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఏప్రిల్ 11న జరిగిన ఈ ఆపరేషన్లో భాగంగా, అమెరికా నావికా దళానికి చెందిన రెండు ఆర్లే బర్క్-క్లాస్ గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్లు..USS ఫ్రాంక్ E. పీటర్సన్ మరియు USS మైఖేల్ మర్ఫీ ఈ జలసంధి గుండా ప్రయాణించాయి. అరేబియన్ సముద్రం నుండి పర్షియన్ గల్ఫ్ వైపు వెళ్ళిన ఈ నౌకలు, తిరిగి వెనుదిరగడం ద్వారా తమ ఉనికిని, ఆధిపత్యాన్ని స్పష్టం చేశాయి. పెంటగాన్, అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) దీనిని ‘ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్’ (Freedom of Navigation) ఆపరేషన్గా పేర్కొన్నాయి. దీనికి ఇరాన్ అనుమతి తీసుకోక పోవడం గమనార్హం.
ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ గతంలో వేసిన సముద్ర మైన్లను (sea mines) తొలగించి, వాణిజ్య నౌకల రాకపోకలను సుగమం చేయడమే ఈ ఆపరేషన్ లక్ష్యం అని అమెరికా పేర్కొంది. రాబోయే రోజుల్లో అండర్వాటర్ డ్రోన్లు, ఇతర అధునాతన సాంకేతిక పరికరాలతో ఈ క్లియరెన్స్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అమెరికా భావిస్తోంది. ఈ క్రమంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో స్పందిస్తూ.. “మేము హర్మూజ్ జలసంధిని క్లియర్ చేయడం ప్రారంభించాం, ఇది ప్రపంచ దేశాల ఇంధన భద్రతకు ఇది మేలు చేస్తుంది” అని వ్యాఖ్యానించారు.
ఇరాన్ ప్రతిస్పందన, ఉద్రిక్తతలు
అయితే అమెరికా చర్యపై ఇరాన్ నుండి ఈ పరిణామంపై భిన్నమైన స్పందనలు వ్యక్తమయ్యాయి. అధికారిక ఇరాన్ మీడియా అమెరికా నౌకలు జలసంధిని దాటలేదని ఖండించగా, కొన్ని వర్గాలు మాత్రం తాము హెచ్చరికలు పంపామని ఆరోపించాయి. అయితే, అమెరికా ఈ ఆరోపణలను పూర్తిగా తిప్పికొట్టింది. ప్రస్తుతం పాకిస్తాన్లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ, హర్మూజ్ జలసంధి ప్రాంతం ఇప్పటికీ అత్యంత ఉద్రిక్తమైన ‘టెన్షన్ పాయింట్’గా కొనసాగుతోంది.
హార్మూజ్ జలసంధిలో అమెరికా చర్యలు ప్రాంతీయంగా ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉన్నాయి. దీనిపై ఇరాన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. శాంతి చర్చలు కొనసాగుతున్నా పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి.


