
భాగ్య లక్ష్మి అనే భారత నౌక హార్ముజ్ జలసంధి దాటే ప్రయత్నం చేయగా.. అనుమతి లేదు, వెంటనే వెనక్కి వెళ్లాలని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. ఇందుకు సంబంధించి ఇరాన్ నావికాదళం, భారత కార్గో షిప్ సిబ్బంది మధ్య జరిగిన రేడియో సంభాషణల క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇరాన్ దళాల హెచ్చరికలతో ‘భాగ్య లక్ష్మి’ నౌక వెనక్కి మళ్లగా.. ముందుగా అనుమతి పొందిన ‘సన్మార్ హెరాల్డ్’ అనే మరో భారత ముడి చమురు నౌకపైనా ఇరాన్ గన్బోట్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పులు జరుపుతున్నారని, తాము వెనక్కి వెళ్తామని ఆ నౌక సిబ్బంది రేడియో కమ్యూనికేషన్లో కోరారు. అయితే, ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వర్గాలు తెలిపాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ సాయుధ దళాలు ఆంక్షలు విధించాయి.
భారతీయ వాణిజ్య నౌకలను అడ్డుకోవడం, కాల్పుల వార్తల నేపథ్యంలో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇరాన్ రాయబారితో మాట్లాడి, భారత నౌకలకు మునుపటిలా సురక్షిత ప్రయాణానికి వీలు కల్పించాలని కోరారు. దీనిపై భారత్లోని ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజిద్ స్పందిస్తూ.. భారత్-ఇరాన్ సంబంధాలు బలంగా ఉన్నాయని, తాజా ఘటనపై ఆరా తీసి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
A post shared by Smashi Business سماشي أعمال (@smashibusiness)


