
📌 Key Points
- ఆగ్రాలో పెళ్లైన వెంటనే రూ. 90 లక్షలు డిమాండ్ చేసిన వధువు.
- డబ్బు ఇవ్వకపోతే శోభనం వద్దని పుట్టింటికి వెళ్లిపోయిన వధువు.
- వరుడి కుటుంబాన్ని సజీవ దహనం చేస్తామని బెదిరించిన వధువు కుటుంబ సభ్యులు.
- గ్యాస్ పైప్ లైన్ పేల్చివేసి, వరుడి కుటుంబాన్ని చంపడానికి ప్రయత్నించిన వధువు తండ్రి, సోదరుడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా జిల్లాలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. పెళ్లైన మొదటిరోజే వధువు శోభనం కోసం రూ.90 లక్షలు డిమాండ్ చేయగా, ఇవ్వలేదని భర్తను సజీవ దహనం చేయడానికి ప్రయత్నించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తొలి రాత్రి షాక్: రూ.90 లక్షలు డిమాండ్
జీవితాంతం తోడుంటానని ఏడడుగులు వేసింది.. అగ్నిసాక్షిగా కట్టుకున్న వాడికి అండగా ఉంటానని ప్రమాణం చేసింది. కానీ, ఆ అగ్ని సాక్షిగా జరిగిన పెళ్లిలో ఆనందం ఒక్క రోజైనా నిలవలేదు. అదే అగ్ని ఆ వరుడి పాలిట మృత్యువుగా మారింది. కేవలం డబ్బు పిచ్చితో ఓ నవవధువు చేసిన ఘాతుకం ఇప్పుడు అందరూ ముక్కున వేలేసుకొనేలా చేస్తోంది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ఆగ్రా జిల్లాలో అత్యంత భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి జరిగిన ఆనందం ఆ ఇంట్లో ఒక్క రోజు కూడా నిలవలేదు. మొదటి రాత్రి శోభనం గడపాలంటే లక్షల రూపాయలు కావాలని వధువు డిమాండ్ చేయడం, దానికి వరుడు నిరాకరించడంతో అతడిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపింది.
వరుడి సోదరి ముస్కాన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది ఏప్రిల్ 29న ఆగ్రా(Agra)కు చెందిన యువకుడికి కల్పన అనే యువతితో ఘనంగా వివాహం జరిగింది. వివాహ క్రతువు ముగిశాక శోభనం కోసం కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం వధూవరులను ఆడపడుచులు గదిలోకి పంపారు. ఇక్కడే అసలు మలుపు (ట్విస్ట్) చోటుచేసుకుంది. వధువు తనపై ఉన్న మేలిముసుగు తీయడానికి (Ghunghat) ఏకంగా రూ.90 లక్షల నగదు కావాలని డిమాండ్ చేసింది.
కుటుంబ సభ్యుల దాడులు, బెదిరింపులు
అంత పెద్ద మొత్తం ఇవ్వలేమని వరుడు స్పష్టం చేయడంతో.. మరుసటి రోజే తనకు శోభనం వద్దంటూ వధువు కల్పన, పెళ్లిలో పెట్టిన నగలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. తొలిరాత్రి జరిగిన విషయాన్ని తన తండ్రి, సోదరులకు చెప్పింది. కాగా, డబ్బు డిమాండ్తో మొదలైన ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. వధువు కుటుంబ సభ్యులు వరుడి ఇంటిపై దాడులు చేయడం, వాట్సాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడటం మొదలుపెట్టారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కుటుంబం మొత్తాన్ని సజీవ దహనం చేస్తామని హెచ్చరించారు.
సజీవ దహనం చేసేందుకు యత్నం
ఇలా ఏడాది కాలం గడిచింది. ఈ ఏడాది మార్చి 26న వధువు కుటుంబ సభ్యులు వరుడి ఇంటికి వచ్చి గొడవకు దిగారు. ఇరు కుటుంబాల మధ్య మాట మాట పెరిగింది. ఈ క్రమంలోనే వధువు తండ్రి, సోదరుడు వరుడి ఇంట్లో ఉన్న పీఎన్జీ (PNG) గ్యాస్ పైప్లైన్ను ధ్వంసం చేసి, కుటుంబం మొత్తాన్ని మంటల్లో కాల్చి చంపేందుకు ప్రయత్నించారు. ఈ దుర్ఘటనలో వరుడితో పాటు అతడి తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ స్థానికులు హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వధువు తరఫు కుటుంబ సభ్యుల ఒత్తిడితో పోలీసులు మొదట వరుడి ఫిర్యాదుపై స్పందించలేదు. చివరకు బాధితులు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం (Court) ఆదేశాల మేరకు ఆగ్రా పోలీసులు ఇప్పుడు FIR నమోదు చేశారు. హత్యాయత్నం, బలవంతపు వసూళ్ల కింద వధువు కుటుంబంపై కేసులు నమోదయ్యాయి. ఒక పవిత్రమైన బంధాన్ని కేవలం డబ్బు కోసం వ్యాపారంగా మార్చేయడం, అదీ విద్యావంతులు ఉన్న సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల జనం విచారం వ్యక్తం చేస్తున్నారు.
డబ్బు కోసం ఇంత దారుణానికి ఒడిగట్టిన ఈ ఘటన సమాజంలో పెరిగిపోతున్న అత్యాశకు అద్దం పడుతోంది. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.


