
📌 Key Points
- రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ, NTPC రామగుండం ప్రాజెక్టుపై సూచనలు
- సెకండ్ ఫేజ్లో 3X800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు
- తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని విజ్ఞప్తి
- బొగ్గు సమీకరణలో ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు సెకండ్ ఫేజ్లో భాగంగా ఏర్పాటు చేయనున్న థర్మల్ పవర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని ఆయన సూచించారు.
రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ రాశారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుపై కీలక సూచనలు చేశారు. సెకండ్ ఫేజ్లో భాగంగా ఎన్టీపీసీ రామగుండంలో ఏర్పాటు చేయనున్న 3X800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం(PPA) చేసుకోవాలని సూచించారు. 5X800 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో ఎన్టీపీసీకి తగిన స్వేచ్ఛ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మొదటి ఫేజ్ లో లాగే రెండవ ఫేజ్ లో ఉత్పత్తి చేసే విద్యుత్ లో 85 శాతం విద్యుత్ ను తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సరఫరా అవుతదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. 3 మార్చి, 2026 న తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యధికంగా 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయ్యిందని గుర్తు చేశారు. రానున్న రోజులలో ఈ డిమాండ్ మరింతగా పెరగనుందన్నారు. అవసరమైన విద్యుత్ ఉత్పత్తి వనరులను సమకూర్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టినట్లు తెలిసిందని పేర్కొన్నారు.
ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుపై సూచనలు
“అతి తక్కువ ఖర్చుతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో థర్మల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడంలో NTPC కి దేశంలోనే విశేషమైన అనుభవం ఉంది. గతంలో విద్యుత్ రంగం మీద రాష్ట్ర శాసనసభలో జరిగిన చర్చలో భాగంగా మొదటి ఫేజ్ లో భాగంగా NTPC రామగుండంలో ఏర్పాటు చేసిన థర్మల్ పవర్ ప్రాజెక్టును గురించి స్వయంగా మీరు ప్రశంసించారు. ఇప్పుడు 5X800 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో NTPCకి తగిన స్వేచ్ఛను ఇవ్వండి. థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన విద్యుత్ ను తక్కువ ధరకే ఉత్పత్తి చేసి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి NTPC సిద్ధంగా ఉంది” అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని విజ్ఞప్తి
ఈ విషయంలో వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి కోరారు. “రామగుండంలో ఏర్పాటు చేయనున్న 3X800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం(PPA) చేసుకునేలా కృషి చేయాలి. అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు మేలు చేకూర్చే రామగుండం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సహకరించాలి” అని సూచించారు.
రామగుండం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణకు మేలు చేస్తుందని, ఈ విషయంలో ప్రభుత్వం సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు. దీనిపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.


