
📌 Key Points
- నీట్ రీ-ఎగ్జామ్ కేంద్రాల్లో విద్యార్థినుల పట్ల సిబ్బంది అనాగరిక ప్రవర్తన.
- శానిటరీ ప్యాడ్ ధరించినట్లు నిరూపించుకోవడానికి ప్యాంటు దించమని బలవంతం చేసిన సిబ్బంది.
- మెటల్ డిటెక్టర్ సౌండ్ రావడంతో బ్రాలు తీయించి అవమానకర తనిఖీలు చేసిన ఘటనలు.
- విద్యార్థినుల మానసిక క్షోభ, NTAపై తల్లిదండ్రుల తీవ్ర ఆగ్రహం.
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ రీ-ఎగ్జామ్ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థినుల పట్ల సిబ్బంది ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. భద్రత పేరుతో బాలికలను అమానుషంగా తనిఖీ చేయడం, బ్రాలు, శానిటరీ ప్యాడ్లు తీయించి అవమానించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పరీక్షా కేంద్రాల్లో అమానుష తనిఖీలు
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ (NEET) రీ-ఎగ్జామ్ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థినుల పట్ల సిబ్బంది ప్రవర్తించిన తీరు తీవ్ర ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. పరీక్షల్లో అక్రమాలను అడ్డుకునే నెపంతో భద్రతా సిబ్బంది అనాగరికంగా, వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా.. యథేచ్ఛగా బాడీ ఇన్వేసివ్ ఫ్రిస్కింగ్ పాల్పడ్డారని పలువురు విద్యార్థినులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను షేర్ చేసుకోవడం కలకలం రేపుతోంది.
విద్యార్థినుల మానసిక క్షోభ
ఓ బాధిత విద్యార్థిని తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె పీరియడ్స్ సమయంలో పరీక్షకు హాజరైంది. మెటల్ డిటెక్టర్ తనిఖీ సమయంలో సిబ్బంది ఆమెను అనుమానిస్తూ.. తను శానిటరీ ప్యాడ్ ధరించానని నిరూపించుకోవడానికి ప్యాంటును కిందికి దించి చూపించాలని బలవంతం చేశారు. పరీక్ష రాయాలనే టెన్షన్లో ఉన్న సదరు విద్యార్థిని ఆ అవమానాన్ని భరిస్తూనే వారు చెప్పినట్లుగా చేయాల్సి వచ్చింది. ఇలాంటి ఘోర అనుభవం కేవలం ఒక్కరికే కాదు, దేశంలోని పలు పరీక్షా కేంద్రాల్లో వేల కొద్దీ విద్యార్థినులకు ఎదురైందని సోషల్ మీడియా కామెంట్లతో తెలుస్తోంది.
NTAపై తల్లిదండ్రుల ఆగ్రహం
మరికొందరు విద్యార్థినులు తమ ఇన్నర్వేర్ ‘బ్రా’ మెటల్ హుక్స్ కారణంగా మెటల్ డిటెక్టర్ సౌండ్ చేసిందని, అందుకు లోనికి తీసుకెళ్లి బ్రా విప్పించి మరీ అవమానకరంగా తనిఖీలు చేశారని వాపోయారు. పరీక్షా కేంద్రాల లోపలికి వెళ్లే ముందు బాలికల పట్ల సిబ్బంది ప్రవర్తించిన ఈ అనాగరిక చర్యలు వారిని మెంటల్గా కుంగదీశాయని తెలుస్తోంది. పరీక్ష రాయడానికి ముందే విద్యార్థినులు తీవ్రమైన ఒత్తిడికి, మానసిక క్షోభకు గురయ్యారని తల్లిదండ్రులు ఎన్టీఏ(NTA)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నీట్ పరీక్షా కేంద్రాల్లో జరిగిన దారుణాలు విద్యార్థినుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. భద్రత పేరుతో జరిగిన ఈ అమానుష చర్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళల హక్కుల ఉల్లంఘనగా దీన్ని పరిగణించాలి.


