
పశ్చిమాసియా (Middle East)లోని ఒమన్ తీరంలో దారుణం చోటుచేసుకుంది. భారతీయులతో కూడిన సెట్టెబెల్లో (Settebello) అనే వాణిజ్య నౌకపై ఇవాళ అటాక్ జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వారిలో 21 మందిని రక్షించగా.. మరో ముగ్గురు భారతీయ సిబ్బంది గల్లంతయ్యారు. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్రంగా ఖండించింది. అయితే, దాడి సమాచారం అందిన వెంటనే మస్కట్లోని భారత రాయబార కార్యాలయం (Embassy) అప్రమత్తమైంది. గల్లంతైన ముగ్గురు భారతీయుల కోసం ఒమన్ నావికాదళం, స్థానిక అధికారుల సహాయంతో అత్యవసర సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఒమన్ తీరంలోని సోహార్ రేవుకు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రస్తుతం అక్కడ నెలకొన్న భౌగోళిక రాజకీయ ఘర్షణల వల్లే ఇవి జరుగుతున్నాయని భారత్ పేర్కొంది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలను టార్గెట్గా చేసుకోవడం తక్షణమే ఆపాలని భారత్ డిమాండ్ చేసింది.


