
📌 Key Points
- శ్రీ చిదంబరం గారు సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది.
- ఈ సినిమా ద్వారా వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
- సినిమాను క్రౌడ్ ఫండెడ్ మూవీగా ప్రారంభించారు.
- రాజమండ్రి, మారేడుమిల్లి ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది.
శ్రీ చిదంబరం గారు సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా విడుదల సందర్భంగా నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు.
నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి ప్రకటన
Sri Chidambaram Garu: శ్రీమతి చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’ (Sri Chidambaram Garu). వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రంతో వినయ్ రత్నం (Vinay Ratnam) దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా చిత్ర నిర్మాతలలో ఒకరైన చింతా గోపాలకృష్ణారెడ్డి (Chinta Gopalakrishna Reddy) మూవీ విశేషాలను మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
సినిమా గురించి నిర్మాత ఏమన్నారంటే?
‘‘కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో మేము ఈ ‘శ్రీ చిదంబరం గారు’ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ సినిమా టీమ్ దాదాపు నాలుగేళ్లుగా కష్టపడుతున్నారు. క్రౌడ్ ఫండెడ్ మూవీగా స్టార్ట్ చేశారు. వీళ్ల కష్టం చూసి మా అమ్మాయి ఈ సినిమాను నా దగ్గరకు తీసుకొచ్చింది. వాళ్లను చూస్తే నిజంగా జాలేసింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ టీమ్ పట్టుదలగా ఉండటం నాకు నచ్చింది. తప్పకుండా హిట్ కొడతారనే నమ్మకం కలిగింది. వెంటనే కథ ఏంటని చూస్తే.. చాలా బాగుంది. ఫీల్ గుడ్ కథతో తెరకెక్కించారు. ఫైట్స్, యాక్షన్ గోల ఉండదు. చక్కగా ఆహ్లాదకరమైన లొకేషన్స్లో చేసిన ఈ మూవీ చూసేందుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు రిలాక్స్ అయ్యేందుకు వచ్చే వారికి నచ్చే ప్లెజెంట్ కంటెంట్ ఇందులో ఉంది. సినిమా బాగా చేయండని వారికి సపోర్ట్ ఇస్తూ ఈ సినిమా టేకప్ చేయడం జరిగింది. రాజమండ్రిలో ఆఫీస్ స్టార్ట్ చేసి, రెండు షెడ్యూల్స్లో మారేడుమిల్లి ప్రాంతంలో 35 రోజులు, రాజమండ్రిలో 10 రోజుల పాటు షూటింగ్ చేశాం. అందమైన లొకేషన్స్ అని ఫారెన్ వెళుతున్నారు కానీ, మన దగ్గరే చాలా అందమైన లొకేషన్స్ ఉన్నాయని ఈ సినిమాతో చూపించబోతున్నాం. చాలా న్యాచురల్గా ఈ సినిమా ఉంటుంది. ఇందులోని హీరో హీరోయిన్ల పాత్రలు చాలా బాగుంటాయి.
చిత్ర విశేషాలు
వాస్తవానికి మొదట ఈ సినిమాకు ‘చిదంబర’ అనే టైటిల్ను అనుకున్నాం. కానీ, గౌరవంగా ఉంటుందని ‘శ్రీ చిదంబరం గారు’ అని మార్చాం. ఈ సినిమాకు వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఓటీటీ హక్కులు ఇంకా ఎవరికీ ఇవ్వలేదు. కొత్త వాళ్ల మూవీ కాబట్టి ఓటీటీలు అంతగా ఆసక్తి చూపవు. సినిమా రిలీజ్ అయ్యాక మా కంటెంట్ ఇది అని చూపించి అప్పుడు ఓటీటీకి ఇవ్వాలనుకున్నాం. అలాగే విదేశాల్లో మా సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన మొదట లేదు. ప్రమోషనల్ కంటెంట్ చూసి ఓవర్సీస్ నుంచి కాల్స్ వచ్చాయి. అలా యూఎస్, యూకేతో పాటు ఇతర దేశాల్లో సినిమా రిలీజ్కు ఇచ్చాం. రీసెంట్గా సెలబ్రిటీ షో నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మా సంస్థలో ప్రస్తుతం ‘రావు బహద్దూర్’ అనే పెద్ద ప్రాజెక్ట్ జరుగుతోంది. ఇంకో సినిమాను నూతన దర్శకుడితో చేయబోతున్నాం. ఈవారం విడుదలవుతున్న సినిమాలన్నీ మంచి ఆదరణ పొందాలని కోరుకుంటున్నాం. మేము 2 గంటల పాటు మంచి వినోదాన్ని అందించబోతున్నాం. టికెట్ రేట్ కూడా 99 రూపాయలే పెడుతున్నాం. మేము మట్టిలో మాణిక్యం లాంటి కథతో వస్తున్నాం. మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తే ఎవరికీ నష్టం రాదు. ఒక మేనేజర్ వర్క్ చేసినట్లు నిర్మాత కూడా ఎప్పుడూ కష్టపడాలి. అప్పుడే ప్రాజెక్ట్ బాగుంటుంది. ఈ రోజు కొన్ని వందల సినిమాలు రిలీజ్ కాకుండా అలా బాక్సుల్లో ఉన్నాయి. నేను కూడా ఈ చిత్రానికి ఓటీటీ డీల్ కోసం వెయిట్ చేసి ఉంటే, ఆ బాక్స్లోకే చేరేది. సినిమాకు పెట్టిన డబ్బులు వస్తే మరో సినిమా చేయడానికి వీలుంటుందని భావిస్తాం. మాకు కె విశ్వనాథ్ రూపొందించినటువంటి సినిమాలను నిర్మించాలని ఉంది. నా సినిమా వల్ల ఎవరూ నష్టపోకూడదు అనుకుంటాను. ఆ నష్టం ఏదైనా ఉంటే మాత్రం నేనే భరిస్తా. ‘క’ సినిమా సీక్వెల్ను త్వరలో ప్రకటిస్తాం’’ అని చెప్పుకొచ్చారు.
కొత్త వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను నిర్మించామని, సినిమా చూసేందుకు ఆహ్లాదకరంగా ఉంటుందని నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


