
📌 Key Points
- పశ్చిమ ఆసియాలో చిక్కుకున్న తెలంగాణ ప్రజల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- ప్రయాణ అంతరాయం, ఇతర అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నంబర్లకు సంప్రదించవచ్చునని ప్రభుత్వం ప్రకటన
- గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న తెలుగు వారిని ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది
- సహాయం కోసం ఏపీ ఎన్నార్టీఎస్ హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలని మంత్రి విజ్ఞప్తి
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న తెలంగాణ ప్రజల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. సహాయం కోసం ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.
తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
పశ్చిమ ఆసియాలో నివసిస్తున్న తెలంగాణ పౌరుల కోసం ప్రభుత్వం దిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సమన్వయం, సహాయం అందించడానికి తెలంగాణ భవన్లో 24X7 కంట్రోల్ రూమ్ను పెట్టింది. ప్రభావిత దేశాల ప్రజలు, కుటుంబ సభ్యుల నుండి ప్రభుత్వానికి ఇప్పటికే కాల్స్ వచ్చాయి. ప్రయాణ అంతరాయం, ఇతర అత్యవసర పరిస్థితులలో, ప్రజలు కంట్రోల్ రూమ్ నంబర్లను కాంటాక్ర్ చేయవచ్చు.
‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం పశ్చిమ ఆసియా దేశాలలో నెలకొన్న పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లోని సీనియర్ అధికారులు ఇప్పటికే విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో పరిస్థితిని అంచనా వేయడానికి నిరంతరం సంప్రదిస్తున్నారు.’ అని తెలంగాణ భవన్ నుంచి ఒక ప్రెస్ నోట్ విడుదలైంది.
గల్ఫ్ సంక్షోభంలో చిక్కుకున్న తెలుగు ప్రజల సహాయార్థం ఏపీ ప్రభుత్వం చర్యలు
ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న తెలుగు పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంటోందని ఆ రాష్ట్ర మంత్రి కె.శ్రీనివాస్ అన్నారు. గల్ఫ్లోని తెలుగు ప్రవాసులు సహాయం కోసం ప్రారంభించిన హెల్ప్లైన్లను ఉపయోగించుకోవాలని కొరారు. ‘ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా రాష్ట్రానికి తిరిగి తీసుకురావడానికి మేం చర్యలు తీసుకుంటున్నాం.’ అని మంత్రి శ్రీనివాస్ పత్రికా ప్రకటనలో తెలిపారు.
కొన్ని విమానాశ్రయాలలో తెలుగు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,తాను పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. కష్టాల్లో ఉన్న తెలుగు ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వం గల్ఫ్ ప్రాంతంలోని ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) కోఆర్డినేటర్లను అప్రమత్తం చేసిందని పేర్కొన్నారు. స్థానిక తెలుగు ప్రజల ఇళ్లలో తాత్కాలిక వసతి, భద్రత, సహాయం అందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.
ఏపీ ఎన్నారై హెల్ప్లైన్ వివరాలు
అత్యవసర పరిస్థితులలో ఏపీ ఎన్నార్టీ హెల్ప్ లైన్ నెంబర్లు +91 8500027678, +91 0863 2340678 నంబర్లకు, మరింత సమాచారం కోసం https://apnrts.ap.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఏ విధమైన తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా స్థానిక అధికారులు , అధికారిక మీడియా ప్రకటనల సమాచారం మాత్రమే ఫాలో కావాలని కోరారు.
గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. సహాయం కోసం హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించగలరు.


