
📌 Key Points
- మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్తో ఇంద్రనీల్ బుల్లితెర స్టార్గా గుర్తింపు పొందారు.
- 2003 నుండి 2023 వరకు 28 సీరియల్స్లో నటించి మంచి ప్రజాదరణ సొంతం చేసుకున్నారు.
- మహేష్ బాబు ‘అతడు’ సినిమా కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నానని ఇంద్రనీల్ వెల్లడించారు.
- త్రివిక్రమ్ అతడులో అజయ్ పాత్ర కోసం 20 రోజులు షూటింగ్ చేశారని ఇంద్రనీల్ పేర్కొన్నారు.
బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు ఇంద్రనీల్, సినిమాలకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని తాజాగా వెల్లడించారు. మహేష్ బాబు సినిమా ‘అతడు’ వల్లే తాను సినిమాల వైపు చూడలేదని, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాను చేసిన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
బుల్లితెర స్టార్గా ఇంద్రనీల్ కెరీర్
Indraneel:సాధారణంగా సినిమాల ద్వారా ఫేమస్ అయిన సెలబ్రెటీలు ఈ మధ్యకాలంలో అవకాశాలు లేక బుల్లితెర సీరియల్స్ లో, షోలలో కనిపిస్తూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. మరికొంతమంది సీరియల్స్ లో నటించి అలా వచ్చిన క్రేజ్ తో సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకున్నారు. కానీ మరి కొంతమంది సీరియల్స్ కోసం సినిమాలను కూడా వదులుకున్న వారు లేకపోలేదు. అలాంటి వారిలో మొగలిరేకులు సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్ కూడా ఒకరు.
మొగలిరేకులు, చక్రవాకం వంటి సీరియల్స్ తో బుల్లితెర స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన ఇంద్రనీల్ తాజాగా శంభాల అనే చిత్రంలో నటించి భయపెట్టాడు. చేసింది చిన్న పాత్ర అయినా.. కటౌట్ కి తగ్గ పెర్ఫార్మన్స్ ఇచ్చి అందరి చేత అద్భుతం అనిపించాడు. ముఖ్యంగా క్యారెక్టర్ తో సంబంధం లేకుండా సినిమా కథను పట్టించుకోకుండా తనకు తగ్గట్టుగా పాత్ర లభించింది అంటే అందులో జీవించేయడం ఖాయం అంటూ దర్శకనిర్మాతలకి కూడా సంకేతాలు ఇస్తున్నారు ఇంద్రనీల్.
మహేష్ బాబు ‘అతడు’ సినిమాతో మలుపు
బుల్లితెర ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. 2003 నుండి 2023 వరకు ఏకంగా 28 సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇకపోతే శంభాల సినిమా విజయం సాధించడంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ఇంద్రనీల్ సినిమాలలో నటించకపోవడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చారు .ముఖ్యంగా మహేష్ బాబు సినిమా అతడు వల్లే తాను మళ్ళీ సినిమాలలో ప్రయత్నాలు చేయలేదు అని కూడా తెలిపారు. ఇంటర్వ్యూలో భాగంగా ఇంద్రనీల్ మాట్లాడుతూ..” చక్రవాకం సీరియల్ మంచి పీక్స్ లో ఉంది. అప్పుడే త్రివిక్రమ్ గారు నాకు ఫోన్ చేసి అతను సినిమాకు నన్ను తీసుకొని 20 రోజులు షూటింగ్ కూడా చేశారు. 20 రోజులు షూటింగ్ తర్వాత మరో 40 రోజులు అడిగారు. ఈ సినిమాలో అజయ్ చేసిన రోల్ మొదట నేను చేశాను.
సినిమాలు వదులుకోవడానికి అసలు కారణం
పొలిటికల్ లీడర్ పాత్ర అది. షియాజీ షిండే కొడుకు పాత్ర నేను చేశాను. ముఖ్యంగా నేను చేసినప్పుడు అసలు ఆ సినిమాలో చూపించిన రోల్ అది కాదు. అది చాలా క్లాసీ గా ఉంటుంది. విలన్ రోల్ అయినా సరే వైట్ అండ్ వైట్ పొలిటిషియన్ గా చాలా మంచిగా డిజైన్ చేశారు. అతను సినిమా షూటింగ్ అప్పుడు నా వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు. అయితే అప్పుడు మరో 40 రోజులు అడిగారు. అయితే అదే సమయంలో సూపర్ హిట్ గా కొనసాగుతున్న చక్రవాకం సీరియల్ లో హీరోగా నటిస్తున్నాను.
ఇదే విషయాన్ని నేను డైరెక్టర్ బిందు నాయుడు మేడంకి చెబితే.. అన్ని రోజులు అడ్జస్ట్ చేయలేనని చెప్పారు. ఇదే మాట త్రివిక్రమ్ మేనేజర్ తో చెప్పాను. వాళ్లు మళ్లీ ఫోన్ చేస్తామని చెప్పారు. కానీ ఫోన్ చేయలేదు. ఆరు నెలల తర్వాత నేనే తిరిగి ఫోన్ చేశాను. అప్పటికే ఆ క్యారెక్టర్ ను అజయ్ తో చేయిస్తున్నారని తెలిసి అప్సెట్ అయ్యాను.ఇక అందుకే అప్పటినుంచి సినిమాలు వద్దనుకున్నాను. మనకి రోల్స్ వచ్చినా కూడా చివరికి వచ్చేసరికి ఉంటుందో ఉండదో అనే అనుమానంతోనే ఇక సినిమాలు చేయలేదు” అంటూ తెలిపారు ఇంద్రనీల్. ఇకపోతే శంభాల సినిమా కథ వినకుండానే చేశానని.. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు అని కూడా చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తన సినీ కెరియర్లో ఎక్కువ సంతృప్తిని ఇచ్చింది శంభాల మూవీ అని తెలిపారు .ఇకపోతే ఈయన ఆరెంజ్ , స్నేహమేరా జీవితం, మిత్ర, ఫోర్స్ ఇలా కొన్ని చిత్రాలలో నటించారు.
మొత్తంగా, చక్రవాకం సీరియల్, అతడు సినిమా సమయంలో త్రివిక్రమ్ ఆఫర్ ఇంద్రనీల్ కెరీర్ను మలుపు తిప్పాయి. బుల్లితెరపై కొనసాగాలని ఆయన తీసుకున్న నిర్ణయం అభిమానులకు ఇప్పుడు ఒక ఆసక్తికర విషయంగా మారింది.


