|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వెండితెరపై ఐపీఎల్ దెబ్బ: సామాన్యుడికి సినిమా ఓ కలగా మారిందా?

Published: 16-05-2026, 5:46 AM
వెండితెరపై ఐపీఎల్ దెబ్బ: సామాన్యుడికి సినిమా ఓ కలగా మారిందా?
  • ఒకప్పుడు సామాన్యుడి వినోదం సినిమా, ఇప్పుడు లగ్జరీగా మారింది.
  • ఐపీఎల్, పెట్రోల్ ధరలు థియేటర్ల ఫుట్‌ఫాల్స్‌ను తగ్గిస్తున్నాయి.
  • మల్టీప్లెక్స్‌లలో టికెట్, క్యాంటీన్, పార్కింగ్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
  • కుటుంబంతో సినిమాకు వెళ్తే రూ.2,000-3,000 ఖర్చవుతోంది.

ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉన్న సినిమా, నేడు లగ్జరీగా మారింది. టికెట్ ధరలు, క్యాంటీన్ దోపిడీ, పెట్రోల్ ఖర్చులు వెండితెరకు ప్రేక్షకులను దూరం చేస్తున్నాయి. ఐపీఎల్ ప్రభావం కూడా థియేటర్ల ఫుట్‌ఫాల్స్‌ను దారుణంగా దెబ్బతీస్తోంది.

సినిమా ఇప్పుడు లగ్జరీగా మారిందా?

Theatre Crisis: ఒకప్పుడు సామాన్యుడికి అతి తక్కువ ఖర్చుతో దొరికే ఏకైక వినోదం ‘సినిమా’. వారాంతం వస్తే చాలు, కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్లి హాయిగా నవ్వుకుని వచ్చేవారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటోంది. సామాన్యుడి బడ్జెట్ పరిమితులు, మారుతున్న కాలక్షేప మార్గాలు వెండితెరకు ప్రేక్షకులను దూరం చేస్తున్నాయి.

Read also- ఓటీటీని షేక్ చేస్తున్న ‘అవతార్ 2’.. హోమ్ వ్యూయర్స్ అస్సలు వందలడంలేదుగా..

ప్రస్తుతం వేసవి కాలం నడుస్తుండటంతో ఒకవైపు ఐపీఎల్ (IPL) క్రికెట్ హంగామా ఊపందుకుంది. ప్రతిరోజూ సాయంత్రం జరిగే ఉత్కంఠభరిత మ్యాచ్‌లు కుటుంబ ప్రేక్షకులను ఇళ్లకు పరిమితం చేస్తున్నాయి. దీనికి తోడు నిరంతరం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు థియేటర్ల ఫుట్‌ఫాల్స్‌ను (ప్రేక్షకుల సంఖ్య) దారుణంగా దెబ్బతీస్తున్నాయి. బైక్ లేదా కారు వేసుకుని థియేటర్‌కు వెళ్లడమే ఒక పెద్ద ఆర్థిక భారంగా మారిన ఈ రోజుల్లో, సామాన్యుడు థియేటర్‌కు వెళ్లాలా వద్దా అని వందసార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఫలితంగా ఈవెనింగ్, నైట్ షోలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పడిపోతోందని ఇండస్ట్రీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఐపీఎల్, పెట్రోల్ ధరల ప్రభావం

కేవలం బయట ఉన్న పరిస్థితులే కాకుండా, థియేటర్ల లోపల ఉండే వ్యయాలు కూడా ప్రేక్షకులను సినిమాకు దూరం చేస్తున్నాయనేది కాదనలేని నిజం. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. సామాన్యంగా టికెట్ ధరలు సామాన్యుడి తలకు మించి ఉండటంతో ప్రేక్షకుడు సినిమాలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. వాహనం నిలపడానికే భారీగా వసూలు చేయడం కూడా ఒక సినిమాకు ప్రజలు రాకపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.

క్యాంటీన్ దోపిడీ అయితే ఇక చెప్పనవసరం లేదు.. వాటర్ బాటిల్ కూడా వందల్లో ఉంటుంది. రూ.150 లేదా రూ.200 పెట్టి టికెట్ కొంటే, లోపల ఒక చిన్న పాప్‌కార్న్ బకెట్ ధర రూ.300 నుండి రూ.400 వరకు ఉంటోంది. కూల్‌డ్రింక్స్, స్నాక్స్ ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబం వీకెండ్‌లో థియేటర్‌కు వెళ్తే, టికెట్లు, పెట్రోల్, స్నాక్స్ అన్నీ కలిపి కనీసం రూ.2,000 నుండి రూ.3,000 వరకు ఖర్చవుతోంది. ఇది ఒక సాధారణ కుటుంబ నెలవారీ బడ్జెట్‌పై పెను భారంగా మారుతోంది.

Read also- సుకుమార్ ఇచ్చిన లీక్.. రామ్ చరణ్ పెట్టిన కండీషన్!.. బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మల్టీప్లెక్స్‌లలో అధిక వ్యయాలు

గతంలో అందరికీ అందుబాటులో ఉండే సినిమా, నేడు ఒక “లగ్జరీ”గా మారిపోయింది. దీనికి తోడు ఓటీటీ విప్లవం తోడవడంతో ప్రేక్షకుల ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు వచ్చింది. “ఇంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్లడం కంటే, కొన్ని వారాలు ఆగితే ఓటీటీలోనే వస్తుంది కదా” అనే ధోరణి ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోతోంది. ఫలితంగా, కేవలం విజువల్ వండర్స్ లేదా విపరీతమైన హైప్ ఉన్న సినిమాలకు మాత్రమే జనాలు థియేటర్లకు వస్తున్నారు. చిన్న, మధ్య తరహా చిత్రాలను థియేటర్లలో చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు.

ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో థియేటర్ వ్యవస్థ మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కేవలం లాభాలనే ధ్యేయంగా పెట్టుకోకుండా, టికెట్ ధరలు, క్యాంటీన్ తినుబండారాల ధరలపై పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. సినిమాను మళ్లీ సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చినప్పుడే, థియేటర్లకు పూర్వ వైభవం వస్తుంది.

సినిమా పరిశ్రమ ఈ సవాళ్లను అధిగమించి, సామాన్యుడికి మళ్లీ చేరువయ్యే మార్గాలను కనుగొనాలి. లేదంటే వెండితెర వినోదం కేవలం ధనికులకే పరిమితమైపోయే ప్రమాదం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.