
📌 Key Points
- ఆంధ్రప్రదేశ్లో మార్చి 25 నుంచి పొగాకు వేలం ప్రారంభం కానుంది.
- దక్షిణ ప్రాంతంలో మొదటి దశ వేలం కందుకూరు, పొదిలి కేంద్రాల్లో జరుగుతుంది.
- ఈ ఏడాది పొగాకు ఉత్పత్తి 147.30 మిలియన్ కిలోలకు చేరుకుంటుందని అంచనా.
- అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం వేలం ధరలపై ఉండవచ్చని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం మార్చి 25 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో రైతులు ధరల గురించి ఆందోళన చెందుతున్నారు. మొదటి దశ వేలం కందుకూరు, పొదిలి కేంద్రాల్లో ప్రారంభమవుతుంది.
మార్చి 25 నుంచి పొగాకు వేలం ప్రారంభం
ప్రకాశం, నెల్లూరు, గోదావరి జిల్లాలను కవర్ చేసే దక్షిణ ప్రాంతం, నార్తర్న్ లైట్ సాయిల్స్ ప్రాంతంలో 16 వేలం వేదికలు ఉన్నాయి. అయితే 2026 పొగాకు వేలం సీజన్ను రెండు దశల్లో ప్రారంభించాలని పొగాకు బోర్డు నిర్ణయించింది. వాటాదారులతో జరిగిన సమావేశంలో పొగాకు బోర్డు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మొదటి దశ మార్చి 25న దక్షిణ ప్రాంతంలోని కందుకూరు-1, పొదిలి కేంద్రాల్లో వేలం ప్రారంభమవుతుంది. నార్తర్న్ లైట్ సాయిల్స్ ప్రాంతంలోని ఐదు వేలం ప్లాట్ఫామ్లు కూడా అదే రోజు వేలం ప్రారంభిస్తాయి. ఇక రెండో దశలో సదరన్ లైట్ సాయిల్స్లోని మిగిలిన ప్లాట్ఫామ్లలో ఏప్రిల్ 9 నుండి వేలం ప్రారంభమవుతుంది.
రెండు దశల్లో వేలం ప్రక్రియ
గత మూడు సీజన్లలో మెరుగైన రాబడి వచ్చింది. మార్కెట్లో మంచి ధరలు లభించడంతో రైతులు ఈ సంవత్సరం పొగాకు సాగును విస్తరించారని అధికారులు తెలిపారు. అంతేకాదు మెుంథా తుపాను ఎఫెక్ట్, శనగకు ధర సరిగా లేకపోవడంలాంటి కారణాలతో రైతులు దీని సాగు వైపే మెుగ్గుచూపారు.
2025-26 సీజన్లో పొగాకు బోర్డు 88.88 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. అయితే అంచనాల ప్రకారం ఉత్పత్తి 147.30 మిలియన్ కిలోలకు చేరుకుంటుంది. ఇది అనుమతించబడిన పరిమాణం కంటే దాదాపు 58.42 మిలియన్ కిలోలు ఎక్కువ. ప్రకాశం జిల్లాలోని సాగుదారులు అనుకూల ధరలను ఆశిస్తున్నారు.
అధిక ఉత్పత్తితో రైతుల ఆందోళన
అయితే ఇజ్రాయెల్ , అమెరికా, ఇరాన్లతో కూడిన ఉద్రిక్తతలతో ముడిపడి ఉన్న ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు, ముడి చమురు ధరలు పెరగడం, ఇతర దేశాలలో పొగాకు ఉత్పత్తి పెరగడం వల్ల వేలం మీద ప్రభావం పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం, మార్చి 25న కందుకూరు-1, పొదిలిలో వేలం ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన వేలం కేంద్రాల్లో ఏప్రిల్ 9 నుండి వేలం ప్రారంభమవుతుంది. గతంతో పోలిస్తే పంట నాణ్యత బాగుంది. కానీ సిగరేట్లపై విధించిన జీఎస్టీ, సుంకాల కారణంగా కర్ణాటక మార్కెట్లో సంక్షోభం నెలకొన్నది. ఆ ప్రభావం కొనుగోళ్లలో జాప్యానికి కారణమైంది. దిగుబడి ఉన్నా.. ధరలపై రైతుల్లో ఆందోళన ఉంది.
పొగాకు వేలం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అయితే అంతర్జాతీయ పరిస్థితులు, ఉత్పత్తి పెరుగుదల వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రైతులు ఆందోళన చెందుతున్నారు.


